BSE : బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) గురువారం స్టాక్ మార్కెట్ (Stock market) ఇన్వెస్టర్లకు కీలక హెచ్చరిక జారీచేసింది. ‘ఈజ్ఇన్వెస్ట్ (EZInvest)’ అనే అనధికారిక సంస్థ కార్యకలాపాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండానే పెట్టుబడి, ట్రేడింగ్ సలహాలు ఇస్తూ ప్రజల నుంచి నిధులు సేకరిస్తోందని బీఎస్ఈ తన సర్క్యులర్లో పేర్కొంది.
ఈజ్ఇన్వెస్ట్ సంస్థకు సెబీ వద్దగానీ, తమ ఎక్స్ఛేంజ్లోగానీ ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదని బీఎస్ఈ స్పష్టంచేసింది. అందువల్ల పెట్టుబడిదారులు ఏవైనా సలహాలు పాటించే ముందు, సంబంధిత సలహాదారుల గుర్తింపు, రిజిస్ట్రేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని కోరింది. ఎక్స్ఛేంజ్లో రిజిస్టర్ అయిన మధ్యవర్తుల వివరాలను తమ అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపింది.
స్టాక్ మార్కెట్లో గ్యారెంటీ లేదా హామీతో కూడిన రాబడి ఇస్తామని చెప్పే ఏ పథకాన్ని నమ్మవద్దని బీఎస్ఈ తేల్చిచెప్పింది. చట్టప్రకారం అలాంటి హామీలు ఇవ్వడం నిషేధమని గుర్తుచేసింది. గత నెలలో కూడా బీఎస్ఈ ఇలాంటి హెచ్చరికనే జారీచేసింది. కొందరు కేటుగాళ్లు బీఎస్ఈ ఉన్నతాధికారుల ఫోటోలను ఉపయోగించి నకిలీ సోషల్ మీడియా ఐడీలు సృష్టించి, వెల్త్ అడ్వైజరీ పేరుతో ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది.