ధరలు మండిపోతున్నాయి. ఏది కొనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి.పేద, మధ్యతరగతి వర్గాలు అవసరాల్ని తగ్గించుకొని జీవనం సాగిస్తుంటే.. సంపన్న వర్గాలూ ఆచితూచి ఖర్చు చేస్తున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 24: దేశంలో ద్రవ్యోల్బణం విజృంభిస్తున్నది. కిరాణా, దుస్తులు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు ఇలా ప్రతీ వస్తువు ధరలు పెరిగిపోతున్నాయి. అంతకంతకూ ఎగబాకుతున్న ఇంధన ధరలు.. అన్నింటి రేట్లనూ ఎగదోస్తున్నాయి. రవాణా భారం పెరిగిందంటూ తయారీదారులు ఉత్పత్తుల ధరలను పెంచేస్తుండటంతో.. అది కొనుగోళ్లను ప్రభావితం చేస్తున్నది. తాజాగా గ్లోబల్ మార్కెట్ రిసెర్చ్ కంపెనీ ‘యూగౌ’ నిర్వహించిన సర్వేలో ఇదే తేటతెల్లమైంది.
గడిచిన 6 నెలల్లో నగర వినియోగదారులు తమ దుస్తులు, ఇంధనం, బయట తిండిపై చేసే ఖర్చులను తగ్గించుకున్నారని ఈ సర్వేలో తేలింది. ఏడాది క్రితంతో పోల్చితే తమ జీవన వ్యయం కూడా భారీగా పెరిగిందని మెజారిటీ ప్రజలు చెప్తున్నారు. ఈ నెల 7-10 తేదీల్లో దేశవ్యాప్తంగా 1,013 మంది నగర వినియోగదారుల అభిప్రాయాలను సేకరించారు. ఇందులో 46 శాతం మంది ఏడాది క్రితంతో పోల్చితే తమ జీవన వ్యయం భారీగా పెరిగిందన్నారు. 33 శాతం మంది పెరిగిందని చెప్పుకొచ్చారు. అయితే ప్రథమ శ్రేణి నగరాలతో చూస్తే.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగర ప్రజానీకంపై ద్రవ్యోల్బణ ప్రభావం కాస్త తక్కువగా ఉన్నది. రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో 7.04 శాతాన్ని తాకిన విషయం తెలిసిందే.
ద్రవ్యోల్బణం నేపథ్యంలో దుస్తుల కొనుగోళ్లను తగ్గించామని 35 శాతం మంది చెప్తున్నారు. అలాగే అలవాట్లకు కోత పెట్టామని 31 శాతం మంది, ఇంధనం ఖర్చుల్ని పరిమితం చేసుకున్నామని 29 శాతం మంది, హోటల్స్, రెస్టారెంట్లకు పెద్దగా వెళ్లడం లేదని 28 శాతం మంది చెప్పారు. ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీసులకూ దూరంగా ఉన్నామని 25 శాతం మంది పేర్కొన్నారు.
ఈ ఏడాది ఆఖరుదాకా ద్రవ్యోల్బణ పరిస్థితులు ఇలాగే కొనసాగవచ్చని రిజ ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. డిసెంబర్దాకా ధరాఘాతమేనని వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు తమవంతు ప్రయత్నాలను చేస్తున్నామన్న దాస్.. నాలుగో త్రైమాసికంలో 6 శాతం దిగువకు చేరవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా, అంతర్జాతీయ పరిస్థితులు, పెరుగుతున్న కరోనా కేసులు, రవాణా ఇబ్బందులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నాయని చెప్పారు.
ద్రవ్యోల్బణం ప్రస్తుతం అత్యధిక స్థాయిలో ఉన్నది. గత 8 ఏండ్లలో ఇదే గరిష్ఠం. పెట్రో ధరలు పెరుగుతూపోతున్నాయి. ఫలితంగా టోకు ధరల సూచీ 30 ఏండ్ల గరిష్ఠాన్ని తాకింది. అందుకే ఇటీవలికాలంలో భారతీయుల జీవనవ్యయం కూడా భారీగా పెరుగుతున్నది.
-యూగౌ సర్వే