శామీర్పేట, మార్చి 30: ప్రపంచ దేశాలకు అన్నం పెట్టే దేశంగా భారత్ అవతరించబోతున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. జినోమ్ వ్యాలీలో ఏటీజీసీ బయోటెక్ అగ్రి ఇన్నోవేషన్ బ్లాక్-సీ కోసం శనివారం మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అత్యధిక జనాభ కలిగిన దేశం అయినప్పటికీ వ్యవసాయ రంగం అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, కరోనా సమయంలో దేశం మొత్తం స్తంభించినప్పటికీ వ్యవసాయ పనులు నిలిచిపోలేదన్నారు.
ఎటువంటి క్రిమి సంహారక పురుగు మందులు లేని ఉత్పత్తులను తయారు చేస్తున్న ఏటీజీసీని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. దీంట్లోభాగంగా కంపెనీకి చెందిన పరిశోధన సెంటర్, ప్రొడక్షన్ యూనిట్లు, ఇన్నోవేషన్ సెంటర్లను సందర్శించారు కూడా. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ రామచంద్ర తేజావత్, హెచ్సీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు, బయో ఎస్తేటిక్స్ సీఎండీ జీవీ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజేశ్, ఏటీజీసీ సంస్థ అధికారులు హాజరయ్యారు.