హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో విజయవంతమైన స్టార్టప్లను ప్రోత్సహిస్తున్న టీ-హబ్.. విదేశీ కంపెనీలతోనూ కలిసి పనిచేస్తోందని దాని సీఈవో మహంకాళి శ్రీనివాస రావు శుక్రవారం తెలిపారు. తాజాగా జపాన్కు చెందిన బియాండ్ నెక్స్ వెంచర్స్తో టీ-హబ్ ఎంవోయూ కుదుర్చుకున్నట్టు చెప్పారు.
టీ-హబ్తో కలిసి ఇండో-జపాన్ ఇన్నోవేషన్ కారిడార్ను బియాండ్ నెక్స్ వెంచర్స్ ఏర్పాటు చేస్తున్నదన్నారు. కాగా, లోతైన శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలు ప్రపంచానికి అందించేందుకు తమ ఈ ఒప్పందం కృషి చేయగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు. ఇక భారత్, జపాన్ స్టార్టప్ల మధ్య సహకారాన్ని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టామని, పెట్టుబడికున్న మార్గాలతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ను సృష్టించే దిశగా నడుస్తామన్నారు.