హైదరాబాద్, సెప్టెంబర్ 8: బ్యాంకింగ్ సర్వీసులన్నింటినీ అందించేందుకు ‘బీవోబీ వరల్డ్’ పేరుతో డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ప్రారంభించినట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. ‘సేవ్, ఇన్వెస్ట్, బారో, షాప్’ పేర్లతో నాలుగు కీలక విభాగాల్లో వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తులు, సర్వీసుల్ని దశలవారీగా బీవోబీ వరల్డ్లో అందిస్తామని బుధవారం బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ఒకే యాప్లో 220పైగా సర్వీసులు లభిస్తాయని, రిటైల్ బ్యాంకింగ్ సర్వీసుల్లో 95 శాతం ఇందులో అందుబాటులో ఉంటాయని బ్యాంక్ వివరించింది. పైలెట్ ప్రాతిపదికన ఆగస్టు 23న బీవోబీ వరల్డ్ మొదలయ్యిందని, ఇప్పటికే 50 లక్షలమందికిపైగా ఖాతాదారులు దీనిని ఉపయోగించారని బ్యాంక్ పేర్కొంది. బీవోబీ వరల్డ్ ద్వారా బ్యాంకు డిజిటల్ ఖాతా తక్షణ వర్చువల్ డెబిట్కార్డ్తో డిజిటల్ ఖాతాను ప్రారంభించుకోవొచ్చని, ఆన్లైన్ దరఖాస్తుద్వారా కొన్ని రకాల రుణాలు వెనువెంటనే పంపిణీ అవుతాయని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ చాధా తెలిపారు.