Axis Bank MCLR Rise | కీలక వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగిస్తూ ఇటీవల ఆర్బీఐ తన ద్రవ్య పాలసీని ప్రకటించింది. కానీ వివిధ బ్యాంకులు తామిచ్చే రుణాలపై వడ్డీరేట్లు పెంచుతున్నాయి. ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) బాటలోనే యాక్సిస్ బ్యాంక్ చర్యలు తీసుకున్నది. మార్జినల్ కాఫ్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) పెంచుతున్నట్లు ప్రకటించింది. అన్ని రకాల టెన్యూర్ (రుణం గడువు) ఆధారంగా ఎంసీఎల్ఆర్ రేట్ ఐదు బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు తెలిపింది. సోమవారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఏడాది గడువు గల రుణాల ఎంసీఎల్ఆర్ 7.40 శాతం, రెండేండ్ల గడువు గల రుణాలపై 7.50, మూడేండ్ల గడువు గల రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.55 శాతానికి పెరుగుతున్నది. ఓవర్ నైట్, నెల రోజుల గడువు గల రుణాల ఎంసీఎల్ఆర్ 7.20 శాతం, మూడు నెలల గడువు గల రుణాలపై 7.30, ఆరు నెలల గడువు ఉన్న రుణాలపై 7.35 శాతం ఎంసీఎల్ఆర్ పెంచేసింది.
రుణం గడువు —- ఎంసీఎల్ఆర్ (%)
ఓవర్నైట్ ——— 7.20%
ఒక నెల ———– 7.20%
3 నెలలు ——— 7.30%
6 నెలలు ——— 7.35%
ఏడాది ———— 7.40%
రెండేండ్లు ——- 7.50%
మూడేండ్లు —— 7.55%
ఎంసీఎల్ఆర్ పెరుగుదలకు అనుగుణంగా రుణ గ్రహీతలు తీసుకున్న రుణాలపై వడ్డీ పెరుగుతుంది. ఇప్పటికే రుణాలు తీసుకున్న రుణ గ్రహీతల లోన్ రీసెట్ తేదీలు వచ్చినప్పుడు ఎంసీఎల్ఆర్కు అనుగుణంగా వడ్డీరేటు ఎక్కువవుతుంది. ఈ నెల 15 నుంచి ఎస్బీఐ తన ఎంసీఎల్ఆర్ 10 బేసిక్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. కొటక్ మహీంద్రా బ్యాంక్ ఏడాది గడువు గల రుణాలపై ఎంసీఎల్ఆర్ను 5 బేసిక్ పాయింట్ల నుంచి 7.4 శాతానికి పెంచుతూ ఈ నెల 16న నిర్ణయించింది. ఈ నెల 12న బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఐదు బేసిక్ పాయింట్లు ఎంసీఎల్ఆర్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. కనీస స్థాయి తక్కువ వడ్డీకి రుణాలివ్వడానికి బ్యాంకులను ఎంసీఎల్ఆర్ అనుమతించదు. ఇటీవల వాణిజ్య బ్యాంకులు తమ రుణాలపై వడ్డీరేట్లు పెంచడానికి అనుమతిస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.