న్యూఢిల్లీ, జూలై 4: దేశీయ ఎగుమతులు పుంజుకున్నాయి. జూన్ నెలకుగాను ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 16.78 శాతం పెరిగి 37.94 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే నెలలో దిగుమతులు 51 శాతం ఎగబాకి 63.58 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం రికార్డు స్థాయికి చేరుకున్నది. గత మూడు నెలలుగా పెరుగుతూ వచ్చిన వాణిజ్యలోటు..గత నెలకుగాను 25.63 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 9.61 బిలియన్ డాలర్లతో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది.
మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్ మధ్యకాలం)లో ఎగుమతులు 22.22 శాతం పెరిగి 116.77 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఇదే సమయంలో దిగుమతులు 47.31 శాతం ఎగబాకి 187.02 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏడాది క్రితం 31.42 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు గత త్రైమాసికానికిగాను 70.25 బిలియన్ డాలర్లుగా నమోదైంది.