BhararPe | భారత్ పే వ్యవస్థాపకుల్లో ఒకరైన అశ్నీర్ గ్రోవర్ భార్య మాధురి జైన్ రాజీనామా చేశారన్న వార్తలను ఆమె కొట్టి పారేశారు. తనకు తానుగా రాజీనామా చేయలేదని ఆమె శుక్రవారం చెప్పారు. తన రాజీనామాను కంపెనీ ఆమోదించినట్లు వచ్చిన వార్తలను నిరాకరించారు. గత నెల 19న జరిగిన బోర్డు సమావేశంలో మాధురి జైన్ రాజీనామా చేస్తారని సంస్థ ఎండీ కం కో-ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ ప్రతిపాదించడంతో సంస్థ మేనేజ్మెంట్లో గందరగోళం నెలకొంది. సంస్థ సమావేశ మినిట్స్ రికార్డుల్లో ఈ అంశం నమోదైందని వార్తలొచ్చాయి. దీనిపై అశ్నీర్ గ్రోవర్ స్పందిస్తూ.. అప్పటికప్పుడు తాను స్పాంటెనియస్గా తీసుకున్న నిర్ణయాన్ని బోర్డు ఆమోదించలేదని చెప్పుకొచ్చారు. తన రాజీనామాపై కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలను ఉల్లంఘించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
`నేను అశ్నీర్ గ్రోవర్ భార్యనైనందునే బోర్డు తన రాజీనామాను ఆమోదించిందని చెబుతున్నారు. కానీ, నేను గ్రోవర్ భార్యగా కంటే కంపెనీ వ్యవహరాల నియంత్రణ అధిపతినని బోర్డు తెలుసుకోవాలి. అశ్నీర్ భార్యగా కంటే తన పాత్ర చాలా ఎక్కువ` అని మాధురి జైన్ వ్యాఖ్యానించారు. నిష్పాక్షిక సమీక్ష తర్వాత నిర్దోషినని రుజువయ్యాక తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఈ నెల 10న అల్వారెజ్ అండ్ మార్షల్ (ఏ అండ్ ఎం) అనే కన్సల్టెంట్ సంస్థకు ఆమె లేఖ రాశారు. ప్రస్తుతం సంస్థలో అవకతవకలపై ఈ సంస్థే దర్యాప్తు చేస్తున్నది.
భారత్పే సంస్థలో దర్యాప్తుపై మీడియాకు వార్తలు లీక్ కావడంపై ఏ అండ్ ఎంకు రాసిన లేఖలో ప్రశ్నించారు. మాధురి జైన్, అశ్నీర్ గ్రోవర్ వారి కుటుంబ సభ్యుల వల్లే భారత్ పేలో అవకతవకలు జరిగాయని తమ దర్యాప్తులో తేలిందని ఏ అండ్ ఎం చెప్పినట్లు వార్తలొచ్చాయి. తన పేరు ప్రతిష్ఠలను దెబ్బ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మాధురి జైన్ ఆరోపించారు.