Financial Plan to face Covid | ఇంకా మనను కరోనా మహమ్మారి భయాలు తొలిగిపోలేదు. మానవాళిని వదిలి విశ్వమారి వెళ్లిపోలేదు. ఇటీవలే బయటపడ్డ కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ మరోదఫా ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. వేగంగా వ్యాపిస్తున్నా.. ఆరోగ్యంపై పెద్దగా దుష్ప్రభావం చూపదనే వార్తలు కాస్త ఊరటనిస్తున్నాయి. ఇప్పటికే రెండ్ వేవ్లతో యావత్ దేశం అతలాకుతలమైంది. ఒమిక్రాన్తో మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్ వస్తే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మన వద్ద ప్రణాళిక.. ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిందే..
ఇప్పటికే ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో అంతర్జాతీయంగా మళ్లీ ఆంక్షలు ప్రారంభమయ్యాయి. విమాన రాకపోకలు తగ్గాయి. విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా కొనసాగుతోంది. పరిస్థితులు మరింత దిగజారితే మరోసారి దేశంలోనూ ఆంక్షలు పెట్టొచ్చు. గత రెండు వేవ్ల వేళ చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకొందరు ఆర్థికంగా చితికిపోయారు. కనుక పరిస్థితులకు అనుగుణంగా గుణపాఠాలు నేర్చుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ థర్డ్వేవ్ వస్తే దాన్ని ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోవాలి. ఆరు నెలలకు సరిపడా నిధులు ఉంచుకోవాలి. ఇల్లు గడవడానికి, వివిధ రుణ వాయిదా చెల్లింపులు, బీమా ప్రీమియం, పిల్లల కాలేజీ, స్కూల్ ఫీజులు తదితరాలు కూడా ఈ ఎమర్జెన్సీ ఫండ్లో సిద్ధంగా ఉంచుకోవాలి. మీ దగ్గర ఆ ఫండ్ లేకపోతే.. మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి కొంత మొత్తం తీసి.. పొదుపు ఖాతాలో డిపాజిట్ చేసుకోవడం ఉత్తమం.
ఎమర్జెన్సీ ఫండ్ సరే.. నెలకు సరిపడిన మొత్తమైనా చేతిలో ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కోవిడ్ చికిత్సకు పలు దవాఖానలు క్రెడిట్/ డెబిట్ కార్డులను కాదని క్యాష్ డిమాండ్ చేశాయి. అవసరమైనప్పుడు ఏటీఎంకు, బ్యాంకుకు పరుగలు తీయడానికి బదులు క్యాష్ రూపంలో కొంత దగ్గర ఉంచుకోవడం ముఖ్యం అంటున్నారు.
థర్డ్వేవ్ భయం.. ఆందోళన వేళ.. ఊహాగానాలకు దూరంగా ఉండాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు స్టాక్స్ క్రయ విక్రయాలకు దిగడం మానుకోవడం మంచిదని చెబుతున్నారు. స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టే రిస్క్లకు దిగకపోవడం మంచిదని సూచిస్తున్నారు. సిప్ మదుపు ఏమైనా ఉంటే యథావిధిగా కొనసాగించాలని చెబుతున్నారు.
కోవిడ్-19 మహమ్మారి ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా అవసరాన్ని గుర్తు చేస్తున్నది. హెల్త్ ఇన్సూరెన్స్ లేని వారు రెండోవేవ్ వేళ దాని బారిన పడ్డవారు అప్పుల పాలైన ఘటనలు ఉన్నాయి. కనుక ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ లేని వారు ఇప్పటికైనా తీసుకోవడం బెటరని చెబుతున్నారు. నగర వాసులు రూ.15-20 లక్షల బీమా కలిగి ఉండాలి. జీవిత బీమా పాలసీ కూడా తీసుకంటే కుటుంబానికి ఆర్థిక భద్రత కలిగించిన వారవుతారని అంటున్నారు.
కరోనా మహమ్మారి వేళ అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నెలవారీగా రుణ వాయిదాలు.. క్రెడిట్ కార్డు వాడకం తగ్గించుకోవాలని అంటున్నారు. ఎక్కువ వడ్డీ ఉన్న అప్పును తక్కువ వడ్డీ ఉన్న చోటికి మారిస్తే వడ్డీ ప్రయోజనం పొందొచ్చు. మీరు విలాస వస్తువుల కొనుగోలు ప్రణాళికలను వాయిదా వేయడం బెటర్ అంటున్నారు.