Apple I-Phone | ఆంధ్రప్రదేశ్లోని ఆపిల్ ఐ-ఫోన్ల తయారీ యూనిట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. దీంతో ఐ-ఫోన్ల తయారీ నిలిపేసినట్లు ఆపిల్ ఐ-ఫోన్ల సరఫరాదారు ఫాక్స్లింక్ తెలిపింది. సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరుగడంతో యూనిట్లో పని చేస్తున్న 400 మంది ఉద్యోగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని ఏపీ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఐ-ఫోన్లకు కేబుల్స్ తయారు చేస్తుంది ఫాక్స్ లింక్.
అగ్ని ప్రమాదం వల్ల ఈ యూనిట్లో దాదాపు 50 శాతం యంత్రాలు దెబ్బ తిన్నాయి. సగం భవనం కూలిపోయిందని తిరుపతి జిల్లా అగ్నిమాపక దళ అధికారి జే రమణయ్య తెలిపారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల రూ.100 కోట్ల నష్టం వాటిల్లి ఉండవచ్చునని ఫాక్స్ లింక్ యాజమాన్యం అంచనా వేస్తున్నది. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఏపీలోని ఐ-ఫోన్ల తయారీ యూనిట్లో అగ్ని ప్రమాదంపై స్పందించేందుకు ఆపిల్ అందుబాటులోకి రాలేదు. ఫాక్స్లింక్ అధికారులు ప్రతిస్పందించలేదు.
ఆపిల్, గూగుల్ వంటి టెక్ సంస్థలు భారత్లో ఫోన్ల తయారీ విస్తరిస్తున్నాయని, భారత్తో టెక్నాలజీ రంగంలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ రెండు కంపెనీల నిర్ణయం స్ఫూర్తిగా నిలుస్తుందని ఇటీవల అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎల్లెన్ వ్యాఖ్యానించారు. ఆపిల్ సంస్థకు సప్లయర్గా వ్యవహరిస్తున్న ఫిన్లాండ్ కంపెనీ సాల్కాంప్ తన సేవలను విస్తరించడానికి వచ్చే రెండు, మూడేండ్లలో భారత్లో దాదాపు 25 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నదని వార్తలొచ్చాయి.