హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ):వృద్ధులకు వ్యక్తిగత సేవలు అందిస్తున్న అన్వయా, వైద్య సేవలు అందిస్తున్న స్టార్టప్ ‘స్టాన్ ప్లస్’ చేతులు కలిపాయి. తద్వారా ఎల్డర్లీ కేర్ సేవలు మరింత మెరుగవుతాయని సంస్థల ప్రతినిధులు మంగళవారం వెల్లడించారు. ఈ సందర్భంగా అన్వయ ఫౌండర్, ఎండీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులకు వైద్య సేవలు అందించడానికి స్టాన్ప్లస్తో చేతులు కలిపినట్లు, దీంతో అంబులెన్సులు, ఇతర అత్యవసర సేవలు అందించడానికి వీలు పడనున్నదన్నారు. ఈ రెండు సంస్థల కలయిక వల్ల వృద్ధులకు ఒకే యాప్లో అన్ని రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఎవరినైనా దవాఖానకు తరలించే సమయంలో అంబులెన్స్ ట్రాకింగ్ సైతం అందుబాటులోకి వస్తుందన్నారు. వారి కుటుంబ సభ్యులు ప్రపంచంలో ఎక్కడున్నా ఎక్కడికి వెళ్తున్నదో తెలుసుకోవచ్చని చెప్పారు. దీంతోపాటు జీపీఎస్ ఆధారిత సేవల వల్ల వేగంగా దవాఖానకు వెళ్లే అవకాశం ఏర్పడుతుందని వివరించారు.