Lloyds Bank | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానున్నది. బ్రిటన్కు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్.. హైదరాబాద్లో తమ నూతన టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించబోతున్నది. గతనెల బ్రిటన్ పర్యటనలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశం జరిగిన నేపథ్యంలో 5 వారాల్లోనే పెట్టుబడి పెట్టేందుకు లాయిడ్స్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాబోయే మూడేండ్లకుపైగా కాలంలో 8వ పేజీలో
డిజిటల్ సేవలను విస్తరించేందుకు గ్రూప్ పెట్టుకున్న 3 బిలియన్ బ్రిటీష్ పౌండ్ల వ్యూహాత్మక పెట్టుబడి లక్ష్యంలో భాగంగానే ఈ టెక్నాలజీ సెంటర్ వస్తున్నది. ప్రస్తుతం కంపెనీకి డిజిటల్లీ యాక్టీవ్ యూజర్లు 2 కోట్లకుపైగానే ఉన్నారు. కాగా, రాష్ట్రంలో వ్యాపార అనుకూలతలతోపాటు అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటంతోనే హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ను ప్రారంభిస్తున్నామని లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోన్ వాన్ కెమెనేడ్ తెలిపారు. టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ఉద్యోగుల నియామక ప్రక్రియను ప్రారంభించామన్నారు. సాంకేతిక, ఇన్నోవేషన్ రంగాల్లో గొప్పగా ఎదుగుతున్న హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులకు దీర్ఘకాలంపాటు సుస్థిరమైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. లాయిడ్స్ గ్రూప్నకు మంత్రి సాదర స్వాగతం పలికారు. బ్రిటన్లో కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందంతో గత నెల సమావేశం అయిన అనతి కాలంలోనే తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం సంతోషాన్ని కలిగించిందన్నారు. నగరంలో ఉన్న వ్యాపార అనుకూల పరిస్థితులు, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో ఉన్న ఎకో సిస్టంతో టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించేందుకు లాయిడ్స్ నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. సుమారు 600 మందిని తొలి 6 నెలల్లోనే ఉద్యోగాల్లోకి తీసుకోనున్నదని, తర్వాత ఈ సంఖ్యను పెంచుతుందని తెలిపారు. నగరంలోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) ఎకోసిస్టం బలోపేతానికి లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ మరింతగా దోహదపడగలదన్నారు.