నిన్న ఫాక్స్కాన్.. నేడు కేన్స్ టెక్నాలజీ.. రేపు…
తెలంగాణకు దేశ, విదేశీ ఎలక్ట్రానిక్స్ రంగ సంస్థలు క్యూ కడుతున్నాయి.
రూ.3వేల కోట్ల పెట్టుబడితో కొంగరకలాన్లో తెస్తున్న కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్కు భూమిపూజ జరిగింది. దీంతో 2వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 24: తెలంగాణలో మరో భారీ పరిశ్రమ కొలువుదీరబోతున్నది. రాష్ట్రంలో ఓఎస్ఏటీ, కాంపౌండ్ సెమీకండక్టర్ ఉత్పాదక కేంద్రాన్ని కేన్స్ టెక్నాలజీ తీసుకువస్తున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలాన్ గ్రామంలో ఈ ప్లాంట్ కోసం మంగళవారం భూమిపూజ జరిగింది. ఇప్పటికే ఇక్కడ గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్కాన్ ప్లాంట్ను తెస్తుండగా, ఆ పక్కనే ఇప్పుడు కేన్స్ సెమీకండక్టర్ తయారీ కేంద్రం రానున్నది. కాగా, పరిశ్రమలకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారని టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి ఈ సందర్భంగా అన్నారు.
రాచకొండ సీపీ దేవేంద్ర చౌహాన్తో కలిసి ఆయన భూమిపూజ చేశారు. కార్యక్రమంలో పలువురు సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. రూ.3,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ను కేన్స్ టెక్నాలజీ తెస్తుండగా, దీంతో కొత్తగా 2,000 మందికిపైగా ఉద్యోగావకాశాలు రానున్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతో కేన్స్ టెక్నాలజీ చైర్పర్సన్ సవితా రమేశ్, ఎండీ రమేశ్ కన్నన్ సమావేశం నేపథ్యంలోనే ఈ ప్లాంట్ రాష్ర్టానికి వచ్చిన విషయం తెలిసిందే.
మౌలిక వసతులన్నీ..
తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్నిరకాల సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నదని, దీంతో పెట్టుబడిదారులు భారీగా ముందుకొస్తున్నారని నర్సింహారెడ్డి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ఐటీ, ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీలు ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. ఈ క్రమంలో కేన్స్ టెక్నాలజీ కూడా రావడం సంతోషకరమన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే కంపెనీలకు భూములు, విద్యుత్తు, రోడ్లు, నీరు ఇలా అనేక రకాల మౌలిక సదుపాయాలను టీఎస్ఐఐసీ ద్వారా వెంటనే కల్పిస్తున్నట్టు చెప్పారు. టీఎస్ఐపాస్ ద్వారా ఇతరత్రా అనుమతులూ తక్షణమే ఇస్తున్నామని వివరించారు. ఆయన అన్నారు.
చకచకా ఫాక్స్కాన్ పనులు
మరోవైపు కొంగరకలాన్ వద్ద ఫాక్స్కాన్ సంస్థ ఏర్పాటుచేస్తున్న ప్లాంట్ పనులు చకచక సాగుతున్నాయి. ఈ ఉత్పాదక కేంద్రం ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కాగా, గడిచిన దాదాపు పదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన మౌలిక వసతుల ద్వారా అనేక జిల్లాల్లో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి వెల్లడించారు. దీంతో తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి చకచక ముందుకు సాగుతున్నదన్నారు. ప్రభుత్వానికి సంపద పెరుగడంతోపాటు లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కూడా లభిస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే కేన్స్ సెమికండక్టర్ ప్లాంట్తోనూ 2వేల మందికి ఉద్యోగావకాశాలు రాబోతున్నాయని తెలిపారు.
శాంతిభద్రతలకు ఢోకాలేదు
శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, ఈ విషయంలో ఇతర రాష్ర్ర్టాల కంటే తెలంగాణ ఎంతో మెరుగ్గా ఉందని రాచకొండ సీపీ దేవేంద్ర చౌహాన్ అన్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడానికి ఇది కూడా ఓ కారణమేనని పేర్కొన్నారు. కాగా, ఆదిబట్ల సమీపంలో టీసీఎస్ను ఏర్పాటు చేయటం వల్ల ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని, అక్కడ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ పోలీసుస్టేషన్ను సైతం ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా చౌహాన్ గుర్తుచేశారు. పరిశ్రమలు ఏర్పాటైతే నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు పెరుగడంతోపాటు స్థానికంగా భూముల ధరలూ పెరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఇండస్ట్రీ, వాణిజ్య ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, ఎలక్ట్రానిక్ సెమీకండక్టర్స్ డైరెక్టర్ చిత్ర హరిహరణ్, సంస్థ ఎండీ రమేశ్ కన్నన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్లాంట్లో తయారయ్యే సెమీకండక్టర్స్ను దేశ, విదేశీ మార్కెట్లలోకి తీసుకెళ్తాం. తైవాన్, జపాన్ తదితర దేశాలకు ఎగుమతి అవుతాయి. రకరకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం మదర్ బోర్డులనూ తయారు చేస్తాం. భవిష్యత్తులో కొంగరకలాన్ పేరు.. ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్మోగుతుంది. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన తైవాన్, జపాన్ వంటి దేశాల సరసన భారత్ నిలువడానికి కొంగరకలాన్ తరహా ఇండస్ట్రియల్ పార్కులు అవసరం.
-సవితా రమేశ్, కేన్స్ టెక్నాలజీ చైర్పర్సన్
కంపెనీ ఉత్పత్తి చేస్తున్న పరికరాలు..
మెడికల్: స్మార్ట్ గ్లూకోమీటర్, వ్యాప్కేర్, కంట్రోలర్
రైల్వేస్: ఆడియో ఫ్రిక్వెన్సీ ట్రాక్ సర్క్యూట్, ఈటీసీఎస్-ఆన్ బోర్డ్ క్యూబిక్ల్
ఐవోటీ/ఐటీ: బార్ కోడ్ స్కానర్, పీఎల్సీ గేట్వే, ఆర్ఎఫ్ఐడీ గేట్వే, గేట్వే అసెట్ కండిషన్ మానిటరింగ్, ఇండస్ట్రీయల్ ట్యాబ్లెట్, హెచ్ఎంఐ, ఆర్టీడీ టెంపరేచర్
ఇండస్ట్రీయల్: ఇంజిన్ కంట్రోల్, స్ట్రీట్ లైట్ కంట్రోలర్, యాక్సలేర్మీటర్, ఇండస్ట్రీయల్ యూపీఎస్,
ఏరోస్పేస్ డిఫెన్స్: ఎలక్ట్రానిక్ సేఫ్ అండ్ ఫైర్ పరికరం, ఏటీఈ అండ్ ఎల్ఆర్యూ అసెంబ్లింగ్, హ్యాండ్ హెల్డ్ సోనార్
ప్రారంభం: 1988
ప్రధాన కేంద్రం: మైసూరు
కీలక వ్యక్తులు: సవితా రమేశ్ (చైర్పర్సన్), రమేశ్ కన్నన్(ఎండీ) రాజేశ్ శర్మ (సీఈవో)
ఉద్యోగులు: 1,500
ఆదాయం: రూ.676 కోట్లు (2022-23లో)