Housing Sales | న్యూఢిల్లీ, మార్చి 27: హైదరాబాద్సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ జనవరి-మార్చిలో జరిగిన ఇండ్ల అమ్మకాలపై ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ బుధవారం ఓ నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై-ఎంఎంఆర్, పుణె, బెంగళూరు, చెన్నై, కోల్కతా హౌజింగ్ సేల్స్పై ఈ రిపోర్టు వచ్చింది. అయితే ఓవరాల్గా గతంతో పోల్చితే 14 శాతం వృద్ధి కనిపించినా.. ఈ ఏడు నగరాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్కతా, చెన్నైల్లో సేల్స్ పడిపోయినట్టు తేలింది. కాగా, ఈసారి ఈ 7 నగరాల్లో 1,30,170 ఇండ్లు అమ్ముడయ్యాయి. నిరుడు ఇదే వ్యవధిలో 1,13,775 యూనిట్లుగానే ఉన్నాయి.
హైదరాబాద్లో టాప్
తాజా రిపోర్టులో గతంతో పోల్చితే హైదరాబాద్లోనే ఇండ్ల అమ్మకాలు అత్యధికంగా పెరిగినట్టు తేలింది. నిరుడు జనవరి-మార్చిలో 14,280 యూనిట్లు అమ్ముడైతే.. ఈ ఏడాది జనవరి-మార్చిలో 19,660 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఫలితంగా 38 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత ముంబై-ఎంఎంఆర్లో సేల్స్ ఎక్కువగా పెరిగాయి. 24 శాతం వృద్ధితో 34,690 యూనిట్ల నుంచి 42,920 యూనిట్లకు ఎగిశాయి. పుణేలోనూ 15 శాతం ఎగబాకి 19,920 యూనిట్ల నుంచి 22,990 యూనిట్లకు పెరిగాయి. ఇక బెంగళూరులో 14 శాతం వృద్ధి కనిపించింది. 15,660 యూనిట్ల నుంచి 17,790 యూనిట్లకు చేరాయి. అయితే ఢిల్లీ-ఎన్సీఆర్లో 9 శాతం పతనమై 17,160 యూనిట్ల నుంచి 15,650 యూనిట్లకు పరిమితమయ్యాయి. కోల్కతాలోనూ 9 శాతం క్షీణతతో 6,185 యూనిట్ల నుంచి 5,650 యూనిట్లకు పడిపోయాయి. ఇక చెన్నైలో 6 శాతం దిగజారి 5,880 యూనిట్ల నుంచి 5,510 యూనిట్లకు దిగొచ్చాయి.
పెరిగిన ధరలు
ఈ జనవరి-మార్చిలో ఇండ్ల ధరలు సగటున 10-32 శాతం పెరిగాయని అనరాక్ తెలియజేసింది. ఈ క్రమంలోనే మార్కెట్లో డిమాండ్ బలంగా కొనసాగుతున్నట్టు పేర్కొన్నది. ముఖ్యంగా గడిచిన పదేండ్లలో రూ.1.5 కోట్లు, ఆపై ధర కలిగిన ఇండ్లకు డిమాండ్ ఈ జనవరి-మార్చిలో ఉన్నంతగా ఎప్పుడూ లేదని, బాగా అమ్ముడుపోయాయని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. ఇండ్ల విక్రయాలు ఈసారి బాగా జరిగాయని సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ సైతం చెప్పారు. అటు కొనుగోలుదారుల నుంచి ఇటు ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. ప్రీమియం, అల్ట్రా-లగ్జరీ ఇండ్లకు గతంతో పోల్చితే ఆదరణ బాగున్నట్టు గురుగ్రామ్కు చెందిన క్రిసుమి కార్పొరేషన్ ఎండీ మోహిత్ జైన్ వెల్లడించారు.