న్యూఢిల్లీ, మే 17: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇన్వెస్టర్లకు అపారమైన విలువను చేకూర్చిందంటూ ఆ సంస్థ నాస్డాక్లో లిస్టింగ్ అనంతర ప్రయాణాన్ని వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ చెప్పుకొచ్చారు. 1997 మే నెలలో అమెరికా టెక్నాలజీ స్టాక్ ఎక్సేంజ్లో అమెజాన్ లిస్టయ్యింది. ఇది జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బెజోస్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చేసిన ఒక పోస్ట్లో కంపెనీ ప్రస్థానాన్ని వివరించారు. 1994 జూన్లో సియాటిల్లో తన గ్యారేజీలో కంపెనీని ఆన్లైన్లో పుస్తకాల విక్రయ ప్లాట్ఫామ్గా మొదలుపెట్టానని, 1997 మే నెలలో లిస్టయినపుడు దీని ధర 1.5 డాలర్లని (రూ.166) గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ షేరు 2216.21 డాలర్ల వద్ద (రూ.1.76 లక్షలు) ట్రేడవుతున్నది. ఈ 25 ఏండ్ల కంపెనీ సుదీర్ఘప్రయాణం సజావుగా జరగలేదని, ఎన్నో రిస్క్లను తీసుకున్నానని బెజోస్ చెప్పారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా రాజీపడకూడదని నిర్ణయించుకున్నానన్నారు.