న్యూయార్క్ : కరోనా కారణంగా తెరపైకి వచ్చిన వర్క్ ఫ్రం హోం కల్చర్ క్రమంగా కనుమరుగవుతోంది. వారానికి మూడు రోజులు ఆఫీసుల నుంచి పనిచేయాలని ఉద్యోగులను అమెజాన్ సీఈఓ అండీ జస్సీ కోరారు. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లి పనిచేస్తే ఇతర వ్యాపారాలూ పుంజుకుంటాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ కార్యాలయాల చుట్టూ ఉండే వ్యాపారాలు పెరుగుతాయని ఆకాంక్షించారు.
కరోనా కలకలంతో గత మూడేండ్లుగా పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేందుకు మొగ్గుచూపగా మహమ్మారి నెమ్మదించడంతో ఆయా కంపెనీలు తిరిగి ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. కరోనా ప్రభావం దీర్ఘకాలం కొనసాగడంతో కొన్ని బృందాలు పూర్తిగా ఇంటి నుంచే పనిచేయగా, మరికొన్ని టీంలు పూర్తికాలం కార్యాలయాల నుంచి పనిచేశాయని, మరికొన్ని బృందాలు హైబ్రిడ్ మోడల్ అనుసరించాయని అమెజాన్ అధికారిక బ్లాగ్పోస్ట్లో పేర్కొంది.
కార్యాలయాల నుంచి పనిచేయడం ద్వారా ఉద్యోగులు ఒకరినొకరు సంప్రదించుకుని సమన్వయంతో పనిచేయడం సులువవుతందని తెలిపింది. ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయాల నుంచి పనిచేయాలని కంపెనీ నిర్ణయించిందని బ్లాగ్పోస్ట్లో అమెజాన్ స్పష్టం చేసింది. కాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.