శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 27: హైదరాబాద్లోని ఏరోసిటీలోగల ఏరోస్పేస్, ఇండస్ట్రియల్ పార్క్ వద్ద ఈ-హబ్ పేరుతో ఓ అడ్వాన్స్డ్ ఎనర్జీ రిసెర్చ్-ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు జీఎమ్మార్తో అమర రాజా బ్యాటరీస్ ల్యాండ్ లీజ్ ఒప్పందం చేసుకున్నది. మొబిలిటి, ఎనర్జీ స్టోరేజ్కు అవసరమైన అత్యాధునిక క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ అభివృద్ధికి ఈ సెంటర్ ఓ దిక్సూచి కాగలదన్న విశ్వాసాన్ని ఇరు సంస్థలు వ్యక్తం చేశాయి. ఇక ఈ ఆర్అండ్డీ సెంటర్.. ఏరోసిటీ ఇండస్ట్రియల్ జోన్లో దాదాపు 7 ఎకరాల్లో రానున్నది. కాగా, విమానాశ్రయానికి దగ్గరలో ఉండటం, మెరుగైన మౌలిక సదుపాయాలు, సమీప పరిశ్రమల దృష్ట్యా ఇక్కడ గ్రీన్ పవర్ స్టోరేజ్ ఎకోసిస్టం అభివృద్ధికి అవకాశాలున్నాయని అంటున్నారు. అలాగే ఇంక్యుబేషన్, ల్యాబ్ స్పేస్లు, సహకార ఎకోసిస్టం ద్వారా ఈ సెంటర్.. స్టార్టప్లకూ దన్నుగా ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వ్యాపారాభివృద్ధికి తమ జీఎమ్మార్ ఏరోసిటీ ఎంతో అనుకూలమని జీఎమ్మార్ ఎయిర్పోర్టు ల్యాండ్ డెవలప్మెంట్ సీఈవో అమన్ కపూర్ అన్నారు. అమర రాజా బ్యాటరీస్ ఈడీ విక్రమాదిత్య గౌరినేని మాట్లాడుతూ తమ రూ.9,500 కోట్ల గిగా కారిడార్లో భాగమే ఈ-హబ్ అన్నారు. మా ఈ ప్రాజెక్టుతో ప్రపంచ ఎనర్జీ, మొబిలిటీ రిసెర్చ్లో హైదరాబాద్కూ సమున్నత స్థానం లభించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.