హైదరాబాద్, ఆగస్టు 17: బ్యాటరీ సొల్యూషన్స్, మినరల్స్ తయారీ సంస్థ అల్టిమన్.. హైదరాబాద్లో మరో యూనిట్ను నెలకొల్పడానికి సిద్ధమైంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం అడ్వాన్స్ లిథియం-అయాన్లో వినియోగించే సెల్స్క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్(క్యామ్)కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని నగరానికి సమీపంలో రూ.300 కోట్లు(35 మిలియన్ డాలర్ల) పెట్టుబడితో ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ మౌర్య సుంకవల్లి తెలిపారు. 20-30 ఎకరాల స్థలంలో నిర్మించతలపెట్టిన ఈ యూనిట్ వచ్చే రెండేండ్లలో అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. వచ్చే రెండేండ్లలో 30 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త యూనిట్ను నెలకొల్పుతున్నట్లు, తద్వారా 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.
ఏఆర్సీఐతో కలిసి యూనిట్
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఏఆర్సీఐ (ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రిసర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలార్జీ అండ్ న్యూ మెటీరియల్) తో కలిసి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన యూనిట్ను శుక్రవారం ప్రారంభిస్తున్నది. రూ.25 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ను నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సరస్వత్ ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ, ఇండస్ట్రియల్ అప్లికేషన్లో అత్యధికంగా వినియోగించే లిథియం అయాన్ సెల్స్ను సంస్థ ఈ యూనిట్లోనే తయారుచేయనున్నది. 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో రోజుకు 100 కిలోల క్యామ్ను ఉత్పత్తి చేయనున్నారు.