హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ప్లాస్టిక్ ప్యాకేజింగ్ రంగంలోని ప్రపంచ దిగ్గజ సంస్థ ‘అల్ప్లా’ హైదరాబాద్లోని పాశమైలారంలో రూ.60 కోట్ల పెట్టుబడితో అధునాతన మోల్డ్ షాప్ను, రూ.10 కోట్లతో అల్ప్లా పాడ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ను (సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని) ఏర్పాటు చేసింది. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ భాగస్వామ్యంతో ఏర్పాటైన వీటిని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి అల్ప్లా గ్లోబల్ సీఈవో ఫిలిప్ప్ లెహ్నర్ హాజరుకానున్నారు. ఇప్పటికే ఆస్ట్రియా, జర్మనీలో మోల్డ్ షాప్లను ఏర్పాటు చేసిన అల్ప్లాకు ఇది మూడవ ప్లాంట్ కావడం విశేషం.
దీంతో రాష్ట్రంలో అల్ప్లా పెట్టుబడి రూ.500 కోట్లకు చేరింది. ఈ షాప్ అత్యంత క్లిష్టమైన ఇంజెక్షన్ మోల్డ్ ప్రాజెక్టులకు సంబంధించిన డిజైనింగ్ నుంచి పూర్తిస్థాయి నిర్మాణం వరకు సాంకేతిక పరిష్కారాలను అందిస్తుందని, భారతీయ నిపుణుల సాంకేతిక-వాణిజ్య నైపుణ్యాలను మరింత మెరుగుపర్చేందుకు దోహదపడుతుందని సంస్థ వర్గాలు తెలిపాయి. డిప్లామా విద్యార్థులు రెండేండ్ల థియరీ కోర్సును పూర్తిచేసిన తర్వాత అల్ప్లా డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్లో చేరేలా సాంకేతిక విద్యాశాఖ తగిన చర్యలు తీసుకొన్నట్టు చెప్పారు. ఇందులో మెకాట్రానిక్స్లో సరికొత్త సీఎన్సీ మెషీన్లు, అధునాతన టెక్నాలజీపై ఆచారణాత్మక విద్యతోపాటు శిక్షణ అందిస్తారన్నారు. ఈ శిక్షణ సందర్భంగా విద్యార్థులకు స్కాలర్షిప్తోపాటు కోర్సు పూర్తయ్యేనాటికి ఉద్యోగం ఇవ్వనున్నట్టు వివరించారు.
47 దేశాల్లో 177 ప్లాంట్లు
ఆస్ట్రియా కేంద్రంగా కొనసాగుతున్న అల్ప్లాకు 47 దేశాల్లో 177 ప్లాంట్లు ఉన్నాయి. దాదాపు 4 బిలియన్ యూరోల (రూ.32,294 కోట్ల) టర్నోవర్ను కలిగివున్న ఈ సంస్థ ప్లాస్టిక్ రిజిడ్ ప్యాకేజింగ్ రంగంలో గ్లోబల్ లీడర్గా కొనసాగుతున్నది. భారత్లో 10 ప్లాంట్లతో దేశీయ మార్కెట్లో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తున్నది. భారత్లో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. తమ తయారీ ప్లాంట్లో అన్ని షిఫ్టుల్లో మహిళా ఇంజినీర్లను నియమించుకొన్న అల్ప్లా.. వికలాంగులకు కూడా తగిన ప్రాధాన్యమిస్తూ పలు అవార్డులను అందుకొన్నది.