న్యూఢిల్లీ : రాబోయే రోజుల్లో విమానాల సంఖ్యను పెంచడంతో పాటు దేశీ, విదేశీ రూట్లలో మార్కెట్ వాటాను కనీసం 30 శాతానికి పెంచుకోవడంపై ఎయిర్ ఇండియా దృష్టి సారించింది. ఈ దిశగా కొన్ని అంతర్జాతీయ విమానాల్లో ప్రీమియం ఎకానమీ క్లాస్ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
వచ్చే నెలలో కొన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ప్రీమియం ఎకానమీ క్లాస్ను ప్రవేశపెడతామని ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ వెల్లడించారు. ఎయిర్లైన్ను టేకోవర్ చేసిన టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా పునరుద్ధరణ ప్రణాళికను అమలు చేస్తోంది. రాబోయే ఐదేండ్లలో విమానాల సంఖ్యతో పాటు గ్లోబల్ నెట్వర్క్ను విస్తరించే లక్ష్యంగా ముందుకెళుతోంది. ఇక స్వల్పకాలంలో కార్పెట్ల రీప్లేస్మెంట్, సీట్ కుషన్స్, కవర్స్ను ఆకర్షణీయంగా అమర్చడం, విమానంలో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్ను చక్కదిద్దడం వంటి చర్యలు చేపడుతోంది.
ముంబైలో జేఆర్డీ టాటా మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ విల్సన్ ఈ వివరాలు వెల్లడించారు. దేశీ విమానాల్లో మెనూను ఇటీవల పూర్తిగా పునరుద్ధరించామని చెప్పారు. నిధులు, విడిపరికాల లేమితో నిలిచిపోయిన 20 విమానాలను ఎయిర్ ఇండియా పునరుద్ధరించిందని తెలిపారు.