హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తున్నదని, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలులో సహకార సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం సచివాలయంలో మంత్రి తుమ్మలతోపాటు మంత్రి వివేక్తో ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధులు బృందం సమావేశమైంది.
ఈ సందర్భంగా తెలంగాణలో సహకార ఉద్యమం బలోపేతానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరు, రైతులకు అందిస్తున్న సేవలు, సహకార రంగంలో రాష్ట్రం సాధించిన పురోగతిని మంత్రి తుమ్మల ఇరాన్ ప్రతినిధి బృందానికి వివరించారు. తెలంగాణలో అమలవుతున్న సహకార విధానాలు, సంస్థాగత సంస్కరణలు, సభ్యులకు అందిస్తున్న సేవలపై ఇరాన్ ప్రతినిధి బృందం ఈ సందర్భంగా ఆసక్తి వ్యక్తం చేసింది. భవిష్యత్లో సహకార రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అంశాలపై చర్చించారు.