Russian Crude Oil | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) బాటలోనే హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్), మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ (ఎంఆర్పీఎల్) పయనించనున్నాయి. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతిపై అమెరికా, మిత్ర దేశాల నిషేధం అమల్లో ఉంది. దీంతో భారత్కు బ్యారెల్పై 20-25 డాలర్ల డిస్కౌంట్ ధరకు రష్యా ముడి చమురు సరఫరా చేస్తున్నది. గతవారం యూరోపియన్ ట్రేడర్ విటోల్ ద్వారా ఐవోసీ మూడు మిలియన్ల బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలు చేసింది. ఇది వచ్చే మే నెలలో అందుబాటులోకి వస్తుంది.
తాజాగా హెచ్పీసీఎల్ కూడా ఈ వారం రెండు మిలియన్ల బ్యారెళ్ల రష్యన్ క్రూడాయిల్ కొనుగోలుకు టెండర్ దాఖలు చేసింది. ఇది కూడా వచ్చే మే నెలలో దిగుమతి అవుతుంది. తాజాగా మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ (ఎంఆర్పీఎల్) కూడా ఒక మిలియన్ బ్యారెల్ ముడి చమురు కోసం టెండర్ దాఖలు చేసింది. భారీ డిస్కౌంట్ ధరకు రష్యా ముడి చమురు విక్రయిస్తుండటంతో ట్రేడర్లు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు.
2020 నుంచి రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ నుంచి నిర్దిష్ట మొత్తంలో ముడి చమురు కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం భారత్కు ఎగుమతి చేసే ముడి చమురు రవాణా, బీమా ఖర్చుల భారం కూడా రష్యా భరించనున్నది.
ఇదిలా ఉండగా, ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ కాంప్లెక్స్ గల రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం.. రష్యా ముడి చమురు దిగుమతి చేసుకోబోమని చెబుతున్నది. రష్యాపై విధించిన ఆంక్షల వల్ల తమ వ్యాపారానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన చెందుతున్నది.