న్యూఢిల్లీ, మార్చి 25: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ ‘యాక్టివా కూడా ఎలక్ట్రిక్ రూపంలో రాబోతున్నది. ఇందుకు సంబంధించి ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ చర్యలను వేగవంతం చేసింది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నది.
2031 నాటికి 10 ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ..దీంట్లో తొలి మాడల్ యాక్టివా కావడం విశేషం. గడిచిన రెండేండ్లుగా ఈవీల రూపకల్పనపై దృష్టి సారించిన సంస్థ..ప్రస్తుతం తుది దశకు చేరుకున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఫిక్స్డ్ బ్యాటరీతో యాక్టివా ఎలక్ట్రిక్ మాడల్ను తీర్చిదిద్దుతున్నది.
వచ్చే ఏడాది మార్చిలో యాక్టివాను విడుదల చేయనున్న సంస్థ..అదే ఏడాది సెప్టెంబర్లో మరో మాడల్ను పరిచయం చేయబోతున్నది. తొలి ఏడాదిలోనే 1-1.5 లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది సంస్థ. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో దేశవ్యాప్తంగా ఈవీల వాడకం అంతకంతకు పెరుగుతుండటంతో వాహన ఉత్పత్తి సంస్థలు వీటిపై ప్రత్యేక దృష్టి సారించాయి.