న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ప్రతిపాదిత న్యూ ప్రైవసీ పాలసీని వచ్చే మే 15 నుంచి అమలు చేయనున్నట్లు యూజర్లకు కొత్తగా రిమైండర్లు పంపడం మొదలు పెట్టింది. వాస్తవంగా గత నెల ఎనిమిదో తేదీ నుంచి న్యూ ప్రైవసీ పాలసీని అమలు చేస్తామని వాట్సాప్ ప్రకటించినా.. యూజర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో కాస్త వెనక్కు తగ్గింది.
యూజర్ల వ్యక్తిగత సంభాషణలను వాట్సాప్ తన పేరెంట్ సంస్థ ఫేస్బుక్తో షేర్ చేసుకుంటామని న్యూ ప్రైవసీ పాలసీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై యూజర్లలో ఆందోళనలు వ్యక్తం కావడంతోపాటు టెస్లా కార్ల తయారీ అధినేత ఎలన్ మస్క్ వంటి ప్రముఖులు టెలిగ్రామ్ యాప్కు మళ్లాలంటూ అప్పట్లో ట్వీట్ చేశారు.
ప్రముఖుల సూచనలతోపాటు ఆందోళన మధ్య పలువురు యూజర్లు వాట్సాప్ ప్రత్యర్థి మెసేజింగ్ యాప్లు సిగ్నల్, టెలిగ్రామ్ వైపు మళ్లడం ప్రారంభించారు. తన యూజర్ల బేస్ కోల్పోతామన్న ఆందోళనతో వెనక్కు తగ్గిన వాట్సాప్.. న్యూ ప్రైవసీ పాలసీ అమలును మే 15వ తేదీకి వాయిదా వేసింది.
ఈ లోగా తన యూజర్లను చైతన పరిచేందుకు వాట్సాప్, దాని పేరెంట్ సంస్థ ఫేస్బుక్ బహుళ వివరణలిచ్చాయి. ఇద్దరు వ్యక్తుల సంభాషణ, చాటింగ్లను తమతో సహా థర్డ్ పార్టీ పొందలేదని వివరించింది వాట్సాప్. ఇప్పుడు యూజర్లు వాట్సాప్ న్యూ ప్రైవసీ పాలసీ నోటిఫికషన్ను పొందడం ప్రారంభించారని నివేదికలు వచ్చాయి. తాజాగా వాట్సాప్ జారీ చేసిన నోటిపికేషన్లో యూజర్ల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమాచార, చాటింగ్పై ప్రైవసీలో ఎటువంటి మార్పులుండవని పేర్కొంది.
అయితే, వాట్సాప్ న్యూ ప్రైవసీ పాలసీని ఇంకా అధ్యయనం చేస్తున్నామని ఈ నెల ఒకటో తేదీన ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. ఉన్నత స్థాయి వ్యక్తులు దీనిపై వాట్సాప్ నుంచి కొన్ని వివరణలు కోరినట్లు తెలిపింది. దీంతో ఈ కేసు తదుపరి విచారణను వచ్చేనెల 19వ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.