హైదరాబాద్, డిసెంబర్ 5: ఆఫీస్ స్పేస్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ద్వారక ఇన్ఫ్రాస్ట్రక్చర్… ప్రత్యేకంగా స్టార్టప్లకోసం ద్వారక ఫ్రైడ్ పేరుతో ప్రత్యేక సెంటర్ను ఏర్పాటు చేసింది. 620 సీట్ల కెపాసిటీతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..స్టార్టప్లకు కోసం ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో 620 మంది ఉద్యోగులు పనిచేసుకోవడానికి వీలుంటుందని, దీంతో సంస్థ మొత్తం సీట్ల కెపాసిటీ 6,500కి చేరుకున్నదన్నారు. వచ్చే రెండేండ్లలో సీట్ల కెపాసిటీని 10 వేలకు పెంచడానికి రూ.30-40 కోట్ల వరకు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రస్తుతం సంస్థ హైదరాబాద్లోవున్న 13 కేంద్రాల్లో 3.2 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు ఇచ్చినట్లు, కొత్తగా 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు ప్రాజెక్టులను 2024 మార్చి నాటికి అందుబాటులోకి రానున్నట్లు ఆయన వెల్లడించారు. తద్వారా మరో 4,500 సీట్లు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే రెండేండ్లలో వరంగల్తోపాటు విజయవాడ, వైజాగ్, తిరుపతిలలో కూడా కో-వర్కింగ్ స్పేస్ కార్యాలయాలను నెలకొల్పనున్నట్లు ఆయన ప్రకటించారు.