New Cars | కార్ల తయారీ కంపెనీలు జోరుమీదున్నాయి. ఈవీ కార్లతోపాటు వచ్చే 11 నెలల్లో 81 కొత్త కార్లను ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 50 శాతానికంటే ఎక్కువే. 2022-23లో కార్ల తయారీ సంస్థలు 54 కొత్త మోడల్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. తాజాగా మార్కెట్లోకి తెచ్చే కార్లలో 66 శాతం న్యూ ప్లాట్ఫామ్పైనే నిర్మిస్తున్నట్లు ఆటో ఇంటెలిజెన్స్ సంస్థ జాటో డైనమిక్స్ వెల్లడించింది. వచ్చే 11 నెలల్లో కొత్తగా వచ్చే కార్లలో 47 శాతం లగ్జరీ కార్లే ఉంటాయని తెలుస్తున్నది. కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కూడా దృష్టి సారిస్తాయి.
ఎస్యూవీ, ప్రీమియం కార్లలో ఎక్కువగా ఉపయోగించే సెమీ కండక్టర్ల సమస్య పరిష్కారం కావడంతో కార్ల తయారీ సంస్థల్లో ఆసక్తి నెలకొంది. వాహన డీలర్ల సంఘం `ఫాడా` గణాంకాల ప్రకారం గత మార్చి నెలాఖరు నాటికి దేశంలో 36.20 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. 2021-22తో పోలిస్తే 23 శాతం ఎక్కువ.
కార్ల కొనుగోలుదారుల ప్రాధాన్యాలు కూడా మారుతున్నాయి. ఎస్యూవీ సేల్స్, సబ్ కంపాక్ట్ ఎస్యూవీ కార్ల సేల్స్ పెరగడంతో కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా కార్ల తయారీ సంస్థలు మోడల్స్ డిజైన్ చేస్తున్నాయి. కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి కేంద్రం ఎలక్ట్రిక్ వెహికల్స్పై ఫోకస్ చేస్తున్నది. కస్టమర్ల నుంచి కూడా ఆసక్తి పెరుగుతున్నది. ధర ఎక్కువగా ఉన్నా హైబ్రీడ్ టెక్నాలజీ కార్లకు గిరాకీ ఎక్కువ అవుతుండటం గమనార్హం.
మరింతగా కర్బన ఉద్గారాల నియంత్రణకు కేంద్రం గత నెల నుంచి రెండో దశ బీఎస్-6 ప్రమాణాలను అమల్లోకి తెచ్చింది. దీంతో కార్ల తయారీ సంస్థలు కూడా కార్ల తయారీలో ఇంజిన్తోపాటు సమూల మార్పులు తెస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) తరహాలో న్యూ ఫ్యుయల్ టెక్నాలజీ కార్ల తయారీ కంపనీలు కొత్త మోడల్ కార్లను తయారు చేయడానికి ప్రేరణగా నిలుస్తుందని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.