న్యూఢిల్లీ, అక్టోబర్ 5: పదిహేను ఏండ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజు 8 రెట్లు పెరుగనున్నది. అలాగే భారీ కమర్షియల్ వాహనాల ఫిట్నెట్ సర్టిఫికెట్ల రెన్యువల్కు కూడా యజమానులు 8 రెట్ల ఎక్కువ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఫీజుల పెంపు అమలులోకి రానున్నది. ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా, హైవేల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఢిల్లీ, దాని పొరుగు ప్రాంతాలపై ఫీజు పెంపు ప్రభావం ఉండదు. ఆయా ప్రాంతాల్లో 10 ఏండ్లు పైబడిన డీజిల్, 15 ఏండ్లు దాటిన పెట్రోల్ వాహనాలను ఇప్పటికే నిషేధించారు. నోటిఫికేషన్ ప్రకారం.. 15 ఏండ్ల కారుకు రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజు రూ.5 వేలకు పెరుగనున్నది. ప్రస్తుతం అది రూ.600గా ఉన్నది. పాత బస్సు లేదా లారీకి ఫిట్నెట్ సర్టిఫికెట్ రెన్యువల్ ఫీజు ప్రస్తుతం రూ.1,500 ఉండగా వచ్చే ఏడాది నుంచి యజమానులు రూ.12,500 చెల్లించాలి. పాత మోటారుసైకిళ్లకు రూ.300 ఉన్న ఫీజు రూ.వెయ్యి కానున్నది.
రిజిస్ట్రేషన్ రెన్యువల్లో జాప్యానికి ప్రైవేటు వాహనాలకు నెలకు రూ.300 చొప్పున, కమర్షియల్ వాహనాలకు రూ.500 చొప్పున జరిమానా వసూలు చేస్తారు. కమర్షియల్ వాహనాల ఫిట్నెట్ సర్టిఫికెట్ రెన్యువల్లో జాప్యం జరిగితే యజమానులు రోజుకి రూ.50 చొప్పున పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రజలు పాత వాహనాలు ఉపయోగించకుండా ఉండేందుకు ఫీజులు పెంచినట్టు కేంద్రం చెబుతున్నది. ప్రైవేటు వాహనాలకు 15 ఏండ్లు పైబడిన తర్వాత 5 ఏండ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. కమర్షియల్ వాహనాలకు 8 ఏండ్లు నిండిన తర్వాత ప్రతి ఏడాదీ ఫిట్నెట్ రెన్యువల్ సర్టిఫికెట్ తప్పనిసరి. వాహనాలకు మాన్యువల్, ఆటోమేటెడ్ ఫిట్నెట్ పరీక్ష ఫీజులను కూడా నోటిఫికేషన్లో కేంద్రం ప్రకటించింది. అక్రమాలు చోటుచేసుకునే అవకాశం ఉన్న మాన్యువల్ ఫిట్నెస్ పరీక్షకు భవిష్యత్తులో స్వస్తి పలికాలన్నది కేంద్రం లక్ష్యంగా ఉన్నది.