Youth for Own Homes | భారతీయ యువత సొంతింటికే ప్రాధాన్యం ఇస్తున్నారా.. విద్యాభ్యాసం పూర్తయి కొలువులో చేరిన ఒకటి రెండేండ్లలోనే సొంతింటికి షిఫ్ట్ కావాలని కోరుకుంటున్నారట. 18-41 ఏండ్ల మధ్య వయస్కుల్లో 45 శాతం మంది యువత మదిలో సిటీలో సొంతింటికి షిఫ్ట్ కావాలనే కోరిక ఉందని సీబీఆర్ఈ సర్వేలో తేలింది. సిటీలో న్యూ హోం వారి ఫస్ట్ ఛాయిస్గా ఉందని ఈ సర్వే సారాంశం. 26-41 ఏండ్ల మధ్య వయస్సు గల వారు అద్దెంట్లో బతకడానికి బదులు సొంతంగా ఇల్లు కొనుక్కోవడానికి 70 శాతం మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏషియా.. భారత్తోపాటు ప్రపంచ దేశాల్లో 20 వేల మందికి పైగా యువత అభిప్రాయాలను సేకరించింది.
నాణ్యమైన జీవనం సాగించడానికే ఇండియన్స్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మెరుగైన ఇంట్లో, మెరుగైన వాతావరణ పరిస్థితుల్లో జీవనం సాగించాలని 52 శాతం భావిస్తున్నారు. వచ్చే రెండేండ్లలో సొంతింటికి షిఫ్ట్ కావాలని 72 శాతం మంది యువత తలపోస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత అమల్లోకి వచ్చిన వర్క్ ఫ్రం హోం.. వర్క్ ఫ్రం ఆఫీస్ పాలసీలలో వారానికి మూడు రోజులు ఆఫీసులకు వెళ్లడమే మంచిదని 69 శాతం మంది అభిప్రాయ పడుతున్నారు.
అత్యధిక యువత కొత్త ఇల్లు కొనుక్కోవడమే తమ ఆకాంక్ష అని చెబుతున్నారు. తాము కొనుగోలు చేసే ఇంటి చుట్టూ సానుకూల వాతావరణం ఉండాలని భావిస్తున్నారు. కనుక రియాల్టీ డెవలపర్లు బెటర్ ఔట్ డోర్, ఇండోర్ ఇంటీరియర్ డిజైన్ పట్ల అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీబీఆర్ఈ ఇండియా సీఈవో అండ్ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ పేర్కొన్నారు.