న్యూఢిల్లీ, జూన్ 28: కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం రూ.6.29 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం రూ.3 లక్షల కోట్లుగా ఉన్న ఎమర్జన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం (ఈసీఎల్జీఎస్) పరిమితిని మరో రూ.1.5 లక్షల కోట్లు పెంచుతూ రూ.4.5 లక్షల కోట్లకు చేర్చింది. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ(ఎంఎస్ఎంఈ)లకు ఊరట లభించగలదని ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తక్కువ వడ్డీరేట్లకే 25 లక్షల చిరు రుణగ్రహీతలకు రూ.1.25 లక్షల వరకు రుణాన్ని అందిస్తామన్నారు.
వైద్య రంగానికి..
అలాగే ఆరోగ్య రంగంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనతోపాటు కరోనా ప్రభావిత రంగాల కోసం రూ.1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇందులో రూ.50,000 కోట్లు ఆరోగ్య రంగానికి కేటాయించారు. 7.95 శాతం వడ్డీకే రూ.100 కోట్ల వరకు రుణ లభ్యత అవకాశమిచ్చారు. పర్యాటక, ఆతిథ్య తదితర రంగాలకు 8.25 శాతం వడ్డీరేటేనన్నారు.
ఇచ్చేది కొంతే..
కాగా, ప్రజారోగ్యం కోసం రూ.23,220 కోట్లను ప్రకటించినా.. అందులో కేంద్రం ఇచ్చేది రూ.15,000 కోట్లే. అలాగే సంస్కరణల ఫలితం ఆధారంగా ఉన్న విద్యుత్తు పంపిణీ పథకానికి రూ.3,03,058 కోట్లు కేటాయించినా.. ఇందులో కేంద్రం సర్దేది రూ.97,631 కోట్లే. ఇక గతేడాది ప్రకటించిన ఉద్దీపనల్లోని కొన్ని పథకాల కాలపరిమితిని పొడిగించిన మోదీ సర్కారు.. మరికొన్నింటికి అదనపు నిధులను ఇస్తామన్నది. మరోవైపు ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజనను వచ్చే ఏడాది మార్చి ఆఖరుదాకా పొడిగించారు. దేశంలో మొబైల్ ఫోన్ల తయారీకి ఊతమిచ్చేలా మొబైల్ ఫోన్ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని 2025-26దాకా పెంచారు. మొత్తంగా 8 ఉపశమన చర్యలు, మరో 8 ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే నిర్ణయాలను ఈ ప్యాకేజీలో తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. దిగాలుపడ్డ వృద్ధి, వాణిజ్య, ఉపాధికి కొత్త ఊపిరిలూదడమే తమ లక్ష్యమని ఆమె అన్నారు. కాగా, ఈ ప్యాకేజీ.. దేశంలో మందగించిన ఆర్థిక కార్యకలాపాలకు నూతనోత్తేజాన్నిస్తుందని, ఉద్యోగ-ఉపాధి అవకాశాలకు ఊతమివ్వగలదన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. సీఐఐ, పీహెచ్డీసీసీఐ తదితర వ్యాపార, పారిశ్రామిక సంఘాలూ స్వాగతించాయి.