న్యూఢిల్లీ, జూన్ 18: దేశంలో అత్యంత వేగవంతమైన 5జీ సేవలు వచ్చే రెండు నెలల్లో అందుబాటులోకి రాబోతున్నాయి. ఆగస్టు చివరి నాటికి తొలి విడుతలో భాగంగా దేశవ్యాప్తంగా 20 నుంచి 25 నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకోస్తామని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి మిగతా నగరాలకు ఈ సేవలను విస్తారించనున్నట్లు ప్రకటించారు. ‘టీవీ 9 వాట్ ఇండియా థింక్ టూడే గ్లోబల్ సమ్మిట్’ కార్యక్రకమంలో మంత్రి మాట్లాడుతూ…ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాటా చార్జీలతో పోలిస్తే భారత్లో చాలా తక్కువగా ఉన్నాయని, ఈ నూతన సేవలతో పెరిగే అవకాశాలు లేవని మంత్రి స్పష్టంచేశారు. 4జీ, 5జీ ఉత్పత్తులు, టెక్నాలజీ పరికరాలు ఇక్కడే తయారవుతుండటంతో ఎలాంటి సమస్య రాదన్నారు. 5జీ సేవలు వచ్చే రెండు నుంచి మూడు నెలల అందుబాటులోకి వచ్చేదానిపై గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన…తొలి విడుత 20 నుంచి 25 నగరాల్లో అందుబాటులోకి రానున్నాయని, ఈ ఏడాది చివరినాటికి మిగతా నగరాలకు విస్తరించనున్నట్లు ప్రకటించారు.
భారత్లో సరాసరి డాటా 2 డాలర్లు
ప్రస్తుతం భారత్లో సరాసరి డాటా ధర 2 డాలర్లు ఉంటే, అదే అంతర్జాతీయంగా 25 డాలర్లు ఉన్నదని మంత్రి పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ పది రెట్లు తక్కువగా ఉన్నాయని, భవిష్యత్తులో ఇంతే స్థాయిలో ఉండే అవకాశం ఉందన్నారు. ఈ అత్యంత వేగవంతమైన సేవలు అందించడానికి మొబైల్ నెట్వర్క్ సంస్థలు నూతన టెక్నాలజీని సిద్ధం చేసుకున్నాయి. ప్రస్తుతం భారత్లో లభిస్తున్న 4జీ సేవల కంటే పది రెట్లు అధిక వేగంతో 5జీ సేవలు లభించనున్నాయి. 5జీ తరంగాలను వేలం వేయడం ద్వారా రూ.4.3 లక్షల కోట్ల ఆదాయం రావచ్చునని కేంద్రం భావిస్తున్నది. మరోవైపు, భారత్లో నెలకు సరాసరి డాటా వినిమయం 18 జీబీ ఉండగా, అదే ప్రపంచవ్యాప్తంగా 11 జీబీ ఉన్నది.