UPI Transactions | ఇప్పుడంతా ఆన్లైన్.. డిజిటల్ చెల్లింపులే.. ఫోన్ పే, పేటీఎం.. భారత్ పే.. గూగుల్ పే యాప్ల ద్వారా అన్ని రకాల పేమెంట్స్ చేయొచ్చు. ఈ యాప్లన్నీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్(యూపీఐ) వ్యవస్థ కింద సాగుతాయి. యూపీఐ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మరింత సులభతరం అయ్యాయి. బ్యాంకు శాఖకు వెళ్లకుండానే నగదును ట్రాన్స్ఫర్ చేసేయొచ్చు. పాన్షాప్ మొదలు మెడికల్.. వైన్షాప్ల వరకు ప్రతి కొనుగోళ్లపైనా యూపీఐ పేమెంట్స్కు ప్రజలంతా అలవాటవుతున్నారు.
సైబర్ మోసగాళ్లు కూడా కొత్త ఎత్తులతో మోసాలు చేస్తున్నారు. యూజర్లకు నకిలీ క్యూ ఆర్ కోడ్లతో, నకిలీ అడ్రస్లతో గాలం వేస్తారు. ఇటువంటి నేరగాళ్లు.. సైబర్ మోసగాళ్ల నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ యూపీఐ పేమెంట్స్ విషయంలో పలు సూచనలు పాటించాలని సూచిస్తున్నారు.
అపరిచితులతో మీరు మీ యూపీఐ చిరునామా షేర్ చేయొద్దు. యూపీఐ అడ్రస్ సురక్షితంగా ఉంచడం అత్యంత కీలక సెక్యూరిటీ ఆప్షన్.. మీ యూపీఐ ఖాతా నుంచి బ్యాంక్ అప్లికేషన్ ద్వారా పేమెంట్స్ చేయడానికి అనుమతించొద్దు. ఇక గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్లకు శక్తిమంతమైన స్క్రీన్లాక్ ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మీ పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ అంకెలు స్క్రీన్లాక్గా వాడొద్దు. అంతే కాదు మీ పిన్ నంబర్ ఎవరికీ షేర్ చేయొద్దు. అనుమానం వస్తే దాన్ని వెంటనే మార్చేయాలి. యూజర్లకు సైబర్ నేరగాళ్లు యూపీఐ పేమెంట్ లింక్స్ పంపుతారు. ఇది యూజర్లను ట్రాప్ చేయడానికి హ్యాకర్లు.. సైబర్ మోసగాళ్లు వాడే సాధారణ టెక్నిక్. లింక్లను షేర్ చేయడం ద్వారా గానీ, కాల్ చేయడం ద్వారా గానీ మీ బ్యాంకు ఖాతాలో మొత్తం డబ్బు ఊడ్చేస్తారు. అటువంటి లింక్లను క్లిక్ చేయొద్దు.
మీ యూపీఐ యాప్స్ పిన్, ఇతర సమాచారం ఎవరితోనూ షేర్ చేయొద్దు. బ్యాంకులు ఎప్పుడు కూడా పిన్, ఓటీపీ తదితర వ్యక్తిగత వివరాలేవీ అడగవు. భారీగా ఆఫర్లు ఇస్తున్నాయన్న ఆశతో ఒకటి, రెండు కంటే ఎక్కువ యూపీఐ యాప్స్ వాడటం ఎంత మాత్రం మంచిది కాదు. ఇక ఎప్పటికప్పుడు యూపీఐ యాప్స్ను అప్డేట్ చేసుకోవాలి. కొత్త ఫీచర్లతో ఎక్కువ బెనిఫిట్లు పొందొచ్చు. తాజా వర్షన్లతో అప్డేట్ చేయడంతో మీ యూపీఐ ఖాతా సేఫ్గా ఉంటుంది.