ముంబై: వచ్చే గణేశ్ చతుర్థి నాడు విపణిలో అడుగు పెట్టనున్న జియో ఫోన్ నెక్ట్స్.. ప్రపంచంలో కెల్లా అతి చౌక అని రిలయన్స్ ప్రకటించింది. దీన్ని గూగుల్తో కలిసి జియో డిజైన్ చేస్తున్నది. దేశంలో 2జీ ఫీచర్ ఫోన్లు వాడుతున్న 30 కోట్ల మందిని స్మార్ట్ ఫోన్ల వైపు మళ్లించడమే జియో లక్ష్యంగా ఉంది.
ఇచ్చిన హామీ మేరకు చౌకగా 7.5 కోట్ల స్మార్ట్ ఫోన్లు విక్రయించాలంటే రూ.15వేల కోట్ల సబ్సిడీ అందించాల్సిన బాధ్యత రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యానిదేనని ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ పేర్కొంది.
విపణిలో అడుగు పెట్టే జియో ఫోన్ నెక్ట్స్ ధర రూ.4000 ఉండొచ్చునని అంచనా. అయితే, మైక్రో ప్రాసెససర్, చైనాలో డిస్ప్లే ధరలు, రవాణా వ్యయం రిలయన్స్ ఇండస్ట్రీస్కు సవాల్గా పరిణమించనున్నది. దీని ప్రకారం ప్రతి ఫోన్పై రిలయన్స్ రూ.2000 అందించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఎంట్రీ లెవల్లో చౌక 4జీ స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ.3,800 పలుకుతున్నది. ప్రజాదరణ పొందిన 4జీ స్మార్ట్ ఫోన్ల ధరలు రూ.6000 పలుకుతున్నాయి. ఈ పరిస్థితుల్లో 30 కోట్ల మంది 2జీ ఫీచర్ ఫోన్ భారతీయ యూజర్లను 4జీ వైపు మళ్లించడం రిలయన్స్కు అంత తేలిక కాదంటున్నారు.
కేవలం ధర మాత్రమే సవాల్ కాదు..బెటర్ ఇంటర్ఫేస్, అడ్వాన్స్డ్ ఫీచర్లు, సుదీర్ఘ కాలం మన్నిక గల బ్యాటరీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. డిస్ ప్లే, మెమొరీ, బిల్ ఆఫ్ మెటీరియల్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఫోన్ ధర ఖరారు చేయడం క్లిష్టమైన అంశమే.
జియో ఫోన్ నెక్ట్స్ ధర కూడా జియో 2జీ ఫీచర్ ఫోన్కు సమానంగా ఉండొచ్చునని ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ గోల్డ్మాన్ సాచెస్ అంచనా వేస్తున్నది. సుమారు రూ.1100-1500 మధ్య ఖరారు చేయొచ్చునని భావిస్తున్నది.
2025 నాటికి 7.5 కోట్ల మంది నూతన యూజర్లను జియో తన సబ్స్క్రైబర్లుగా చేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకైనా కస్టమర్లను చేరుకోవడానికి రిలయన్స్ సబ్సిడీ ఇవ్వక తప్పనిసరి పరిస్థితి నెలకొందని గోల్డ్ మాన్ సాచెస్ వ్యాఖ్యానించింది.
దీని ప్రకారం జియో రూ.15 నుంచి రూ.30 కోట్ల మేరకు సబ్సిడీ ఇవ్వాల్సి రావచ్చు. రెండేండ్లలో ఆ సబ్సిడీని రిలయన్స్ పూడ్చుకోవచ్చు. అలా జరిగితే జియోకు గొప్ప ఆఫర్ అవుతుందని అంచనా.