న్యూఢిల్లీ, డిసెంబర్ 12: రూపాయి పతనాన్ని నిలువరించడానికి రిజర్వ్బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో విలువైన విదేశీ మారక నిల్వల్ని భారీగా ఖర్చుచేసింది. 2022 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో రూపాయి ఒడిదుడుకుల్ని నివారించడానికి ఆర్బీఐ నికరంగా 33.42 కోట్ల డాలర్లను విక్రయించిందని స్వయానా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో ప్రకటించారు.
ఇంత భారీగా వ్యయపర్చినా ఫలితం లభించలేదనడానికి ప్రస్తుత రూపాయి విలువ నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఏప్రిల్ నెల ఆరంభంలో డాలరు మారకంలో 75.5 ఉన్న రూపాయి విలువ ఈ సోమవారం 82.51 వద్ద ముగిసింది. ఈ మధ్యకాలంలో ఇది 9 శాతంపైగా పతనమయ్యింది. కొద్ది వారాలుగా అమెరికా కరెన్సీ బలాన్ని సూచించే డాలర్ ఇండెక్స్ 116 నుంచి 105 మేరకు 9.5 శాతం తగ్గినప్పటికీ, రూపాయి ఆల్టైమ్ కనిష్ఠం 83.20 నుంచి కేవలం 0.8 శాతం మాత్రమే కోలుకోగలిగింది.
రూపాయి విలువను మార్కెట్ నిర్ణయిస్తుందని, రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్య విధానం కఠినతరం కావడంతో డాలరు బలపడి, రూపాయి పతనమవుతున్నదని సీతారామన్ వివరించారు. అయితే ఇతర ఆసియా కరెన్సీలు చైనా రెన్మిన్బీ, ఇండోనేషియా రుపయ్యా, ఫిలిప్పీన్స్ పెసో, దక్షణ కొరియా వన్, తైవాన్ డాలర్ తదితరాల కంటే రూపాయి తక్కువ తగ్గిందని ఆర్థిక మంత్రి చెప్పారు. విదేశీ మారక నిల్వల్ని పెంచుకోవడానికి కార్పొరేట్ల విదేశీ వాణిజ్య రుణ సేకరణ పరిమితిని 1.5 బిలియన్ డాలర్లకు పెంచడం వంటి వివిధ చర్యల్ని ఆర్బీఐ తీసుకుందన్నారు.
రుణాలు రైటాఫ్ చేసినా వసూలు ప్రక్రియ ఆగదు
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మొండి బకాయిల్ని, కేటాయింపులు జరిపిన నిరర్థక రుణాల్ని నాలుగేండ్ల తర్వాత బ్యాంక్లు వాటి ఖాతాపుస్తకాల్లోంచి రైటాఫ్ చేసి, తొలగిస్తాయని సీతారామన్ లోక్సభకు తెలిపారు. అయితే రుణాలు రైటాఫ్ జరిగినా, సంబంధిత రుణగ్రస్తులు చెల్లింపు చేయాల్సిందేనని, వారి నుంచి రికవరీ ప్రక్రియను బ్యాంక్లు కొనసాగిస్తాయన్నారు. సివిల్ కోర్టులు, డెట్ రికవరీ ట్రిబ్యునళ్లలో దావాలు వేయడం, దివాళా చట్టం కింద కేసులు దాఖలు చేయడం తదితర రికవరీ యంత్రాంగాల ద్వారా రైటాఫ్ జరిగిన రుణాల్ని వసూలు చేస్తాయని వివరించారు.