హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రధాన వ్యాక్సిన్ల తయారీ సంస్థలైన భారత్ బయోటెక్-ఈ, బయోలాజికల్ వద్ద 25 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో బయోలాజికల్ వద్ద 20 కోట్ల కార్బేవ్యాక్స్ వ్యాక్సిన్లు ఉండగా, అదే భారత్ బయోటెక్ వద్ద 5 కోట్ల కోవాగ్జిన్ డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ఇరు సంస్థలు ప్రకటించాయి. వీటికి సంబంధించి ఆర్డర్లు వస్తే వెంటనే పంపిణీ చేస్తామని ప్రకటించాయి కూడా. దీనిపై బయోలాజికల్-ఈ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ పరాద్కర్ మాట్లాడుతూ.. తమ కంపెనీ ఇప్పటివరకు 30 కోట్ల కార్బేవ్యాక్స్ డోసులు తయారు చేసిందని, కోవిడ్-19 నిర్మూలనలో తమ అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో 10 కోట్ల డోసులను ప్రభుత్వానికి సరఫరా చేసినట్లు, మరో 20 కోట్ల డోసులు పూర్తిగా పరీక్షించి పంపిణీకి సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.