న్యూఢిల్లీ: ప్రముఖ లిక్కర్ బిజినెస్మెన్, బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో పరారీలో ఉన్న నిందితుడు విజయ్మాల్యను భారత్కు బ్రిటన్ అప్పగింత ప్రక్రియ మరింత జాప్యమయ్యే సంకేతాలు వస్తున్నాయి. భారత్లో మనీ లాండరింగ్, ఫ్రాడ్ అభియోగాలను ఎదుర్కొంటున్న విజయ్ మాల్య అప్పగింతకు లీగల్ ప్రాసెస్ ఉందని భారత్లో బ్రిటన్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ శుక్రవారం వ్యాఖ్యానించారు. దానికి షార్ట్ కట్ దారుల్లేవని పేర్కొన్నారు. తమకు అప్పగించాలన్న భారత్ అభ్యర్థనను సవాల్ చేస్తూ విజయ్ మాల్య దాఖలు చేసిన పిటిషన్ గతేడాది మేలో సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. నాటి నుంచి బ్రిటన్ అభ్యర్థన పెండింగ్లోనే ఉంది.
దీనిపై భారత్లో బ్రిటన్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ స్పందించారు. భారత్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను వెనక్కు పంపాలన్న అభ్యర్థన అత్యవసరమైందని, ముఖ్యమైందని గుర్తిస్తున్నట్లు చెప్పారు. అయితే, దీనికి కారణాలు వెల్లడించకున్నప్పటికీ న్యాయ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందన్నారు.
‘నిందితుల అప్పగింత అడ్మినిస్ట్రేటివ్ అండ్ జ్యుడీషియల్ ప్రాసెస్. దీనిపై కోర్టులు నిర్ణయం తీసుకోవాలి. విజయ్ మాల్య విషయంలో దేశ హోంమంత్రి ఎగ్జిక్యూటివ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ కొన్ని విషయాలను న్యాయమూర్తులు నిర్ణయిస్తారు. కోర్టులు, న్యాయమూర్తుల తమ పద్దతుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు’ అని వ్యాఖ్యానించారు.
గతేడాది బ్రిటన్ సుప్రీంకోర్టులో విజయ్మాల్య పిటిషన్ ఓడిపోయినప్పటి నుంచి ఆయనను అప్పగించాలని భారత్ వత్తిడి తెస్తున్నది. అయితే, తనకు ఆశ్రయం కల్పించాలని విజయ్ మాల్య పెట్టుకున్న విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవద్దని గత జూన్లో బ్రిటన్ను భారత్ కోరింది. 2016 మార్చి నుంచి బ్రిటన్లోనే విజయ్మాల్య ఉన్నారు.
2017 ఏప్రిల్ 18 నుంచి అప్పగింత పిటిషన్పై ఆయన బెయిల్పైనే ఉన్నారు. భారత కోర్టుల్లో విజయ్ మాల్య సమాధానం చెప్పాల్సి ఉందని బ్రిటన్ హైకోర్టు 2018లోనే తీర్పు చెప్పింది. గత వారం అవినీతి కేసులో చిక్కుకున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సైతం భారత కోర్టుల్లో సమాధానం చెప్పుకోవాల్సి ఉందని పేర్కొనడం గమనార్హం.