హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ ద్వారా తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్బీసీఎల్)కు ఎంపికైన 60 మంది అభ్యర్థులకు రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ నియామక పత్రాలు అందజేశారు. సీఎస్ సోమేష్ కుమార్, ఆబ్కారీశాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ హాజరైన ఈ కార్యక్రమం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థలను ఆదాయ మార్గాలుగా చూశారే తప్పా ఏనాడు సంస్థ బాగోగులు, ఉద్యోగులకు మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ప్రభుత్వ కార్యాలయాలకు రవాణా సదుపాయాలను కల్పించారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆబ్కారీశాఖ అధికారులు అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో మద్యం అక్రమ రవాణా ఆగిందన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరిగిందన్నారు. టీఎస్బీసీఎల్ సంస్థను మరింత అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ.. 62 మంది ఉద్యోగులతో టీఎస్బీసీఎల్ ప్రతి నెల సుమారు రూ. 3 వేల కోట్లతో ఏడాదికి రూ. 36 వేల కోట్ల టర్నోవర్ సాధించిన సంస్థ ప్రపంచంలో ఎక్కడ లేదన్నారు. టీఎస్బీసీఎల్ సంస్థ ద్వారా ప్రభుత్వానికి బాగా ఆదాయం వస్తుందన్నారు. సంస్థలోకి కొత్తగా వస్తున్న ఉద్యోగులను స్వాగతించారు. ఉద్యోగులు మరింత కష్టపడి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆబ్కారీశాఖ అదనపు కమిషనర్ అజయ్ రావు, రెవెన్యూశాఖ జాయింట్ సెక్రటరీ రాంసింగ్, టీఎస్బీసీఎల్ ఓఎస్డీ సంతోష్ రెడ్డి, ఆబ్కారీశాఖ ఉన్నతాధికారులు హరికిషన్, జీఎం అబ్రహం తదితరులు పాల్గొన్నారు.