గోదావరిఖని, మే 8 : ‘నిప్పు లాంటి మనిషిపై ఇన్ని అభాండాలా?.. ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే అల్లిన కట్టుకథలు ఇవి.. మా ఊరిలో మాకు తెలియకుండా మంత్రి కొప్పుల మూడెకరాల భూమి కబ్జా చేశాడన్న ‘వెలుగు’ పేరిట రాసిన చీకటి రాతలు మమ్మల్ని మానసిక క్షోభకు గురిచేశాయి.. ప్రజల కోసమే పనిచేస్తున్న ఈశ్వరన్నకు మచ్చ తెచ్చేలా ప్రయత్నాన్ని ఖండిస్తున్నాం.. దమ్ముంటే ఆ ఫిర్యాదు దారుడు ఎవరో ప్రజల మధ్యకు తీసుకురండి.. నేడు (ఆదివారం) జనగామ కచీడి వద్దనే గ్రామస్థులందరం కూర్చుంటాం. కబ్జా చేసినట్టు ఎవరు ఫిర్యాదు చేసినా వారి పక్షాన నిలబడి పోరాడుతాం’ అని పెద్దపల్లి జిల్లా జనగామ గ్రామస్థులు స్పష్టంచేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ గోదావరిఖని శివారులోని జనగామలో మూడెకరాల భూమి కబ్జా చేశాడన్న ప్రచారాన్ని ముక్తకంఠంతో ఖండించారు.
ఈ మేరకు శనివారం గ్రామంలో గ్రామస్థుల సమక్షంలో అక్కడి కార్పొరేటర్ దాతు శ్రీనివాస్, గ్రామస్థులు జనగామ శంకర్, మల్లేశం, జనగామ కవిత నిజాలను వెల్లడించారు. మా గ్రామంలో మూడెకరాలను కబ్జా చేయాల్సిన అవసరం మంత్రికి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. గ్రామ శివారులోని మూడెకరాల భూమి అప్పటి ఆక్సిజన్ ప్లాంట్కు సంబంధించిన యాజమాన్యం బ్యాంకురుణం చెల్లించని కారణంగా వేలం వేసిందని గుర్తుచేశారు. అంతేగానీ మంత్రి కొప్పులకు గానీ, ఆయన భార్య పేరు మీద గానీ కబ్జా చేసుకోలేదని స్పష్టంచేశారు. నిఖార్సయిన వ్యక్తి మంత్రి కొప్పులను అబాసుపాలు చేయడం కోసం చేస్తున్న ప్రచారాలు నమ్మవద్దనీ, వాస్తవాలన్నీ ఆదివారం గ్రామ చావడి వద్ద నిరూపిస్తామని తెలిపారు. కాగా, మూడెకరాల భూమికి సంబంధించి ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఎవరో తమకు తెలియదని, అందులో కించిత్తు వాస్తవం లేదని జనగామకు చెందిన ఎం దివాకర్, ఎన్ కొమురయ్య, వసంత స్పష్టంచేశారు.
బ్యాంకు వేలంలో గోపికృష్ణ కొనుగోలు చేశాడనీ, ఆ భూమిని 2018 జులై 9లో మేము (ఎం దివాకర్, కే స్నేహలత, నూనె కొంరయ్య, వసంత) కొనుగోలు చేశామని స్పష్టంచేశారు. తాము ఎవరికీ బినామీలము కాదని, మంత్రిని బదనాం చేసేందుకు కొంతమంది వ్యక్తులు కుట్రలు చేస్తున్నారని స్పష్టంచేశారు. జనగామ గ్రామస్థుల కోరిక మేరకే జాతీయ రహదారి నుంచి రోడ్డు వేసినట్టు చెప్పారు.