అమరావతి : ఏపీలో ఇటీవల ప్రకటించిన పదో తరగతి పరీక్షల ఫలితాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిర్వహించిన జూమ్లో వైసీపీ నాయకుల ప్రత్యక్షం ఆరంభం మాత్రమేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై అనవసరంగా ఆరోపణలు చేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని తెలిపారు. టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
విద్యావవస్థపై చర్చకు లోకేశ్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిపై వైసీపీ నాయకులు ఎవరైనా, ఎప్పుడైనా చర్చకు సిద్దమేనని పేర్కొన్నారు. విద్యార్థుల ఫెయిల్తో ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన వెల్లడించారు. ఆత్మకూరులో టీడీపీ ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. టీడీపీ పోటీ చేసి ఆ ఫలితాలనే రెఫరెండంగా తీసుకోవాలని ప్రతి సవాల్ విసిరారు.