వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అధికార వైసీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కసారిగా పవన్ కల్యాణ్పై విరుచుకుపడుతున్నారు. మంత్రులు బాలినేని శ్రీనివాస్, కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో సహా మరికొందరు పవన్పై విరుచుకుపడుతున్నారు. పవన్ కల్యాణ్ ఓ క్లారిటీ లేని నాయకుడని మంత్రి బాలినేని అభివర్ణించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో కూడా రైతుల ఆత్మహత్యలు జరిగాయని, అప్పుడు ఎందుకు మాట్లాడలేదని బాలినేని మండిపడ్డారు.
ఇక ఏపీ వ్యవసాయ మంత్రి కన్నబాబు కూడా పవన్పై ఫైర్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబే జనసేనకు రోడ్ మ్యాప్తో అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు హయాంలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మరి అప్పుడు పవన్ ఎందుకు విమర్శలు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. అప్పటి సర్కార్ తమ లాగా వైఎస్సార్ రైతు భరోసా, రైతులకు వడ్డీ లేని రుణాల లాంటి పథకాలు ఏమైనా ఇచ్చిందా? అని మంత్రి ప్రశ్నించారు. అప్పుడు మాట్లాడని పవన్.. ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. జగన్ సీఎం కాలేరని అప్పట్లో కూడా పవన్ అన్నారని, బంపర్ మెజారిటీతో జగన్ గెలిచారని కన్నబాబు గుర్తు చేశారు.
ఇక సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా పవన్పై మండిపడ్డారు. రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్కు తాము భయపడమని తేల్చి చెప్పారు. పవన్, బీజేపీ, చంద్రబాబు కలిసి వచ్చినా… తాము భయపడమని అన్నారు. చంద్రబాబు పల్లకి మోయడానికే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని అంబటి ఎద్దేవా చేశారు.