అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో వివేకా (YS Viveka ) కూతురు సునీత చెబుతున్నవన్నీ అబద్దాలేనని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala RamakRsihna Reddy ) అన్నారు. రెండు రోజుల క్రితం సీబీఐ (CBI ) సంస్థ సీబీఐ కోర్టుకు సమర్పించిన సునీత వాంగ్మూలంలో పేర్కొన్న విషయాలు బయటకు వచ్చిన నేపథ్యంలో సజ్జల మంగళవారం వాటిని ఖండించారు.
తాను, భారతితో మాట్లాడిన ఫోన్ ఆధారంగా నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు కొత్త కథ అల్లారని ఆరోపించారు. కథ ఎలా మలుపు తిరగాలంటే అలా కొత్తగా ఒక స్టేట్మెంట్ వస్తుందని విమర్శించారు. తాను భారతితో కలసి సునీత ఇంటికి వెళ్లలేదని, వివేకా చనిపోయాక కొన్ని రోజులకు భార్యతో కలిసి పరామర్శ కోసం వెళ్లానని చెప్పారు. చనిపోయిన వ్యక్తి గౌరవం కాపాడాలని తాము తపన పడుతుంటే, బతికున్న వారిని బజారుకు ఈడుస్తున్నారని వైఎస్ వివేకా కుటుంబ సభ్యులపై మండిపడ్డారు.
చంద్రబాబు ( Chanadra Babu ) వెంట ఉండేవాళ్లు ఈ రోజు వివేకా గౌరవాన్ని కాపాడేవాళ్లుగా మారానని దుయ్యబట్టారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరిపిన తీరు అత్యంత దారుణంగా ఉందని వాపోయారు. అనుమానాలు ఓ వైపు చూపుతుంటే , దర్యాప్తు మరోవైపు జరుగుతుందని అన్నారు. షమీమ్తో రెండో వివాహం గురించి కొత్త ఛార్జ్షీట్లో ప్రస్తావించి అది కారణం కాదని తేల్చారని ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోవడం తమకు షాక్కు గురిచేసిందని పేర్కొన్నారు. వివేకా చనిపోవడానికి రెండు, మూడు రోజుల ముందు నాతో కూడా మాట్లాడారని అన్నారు. చిన్నాన్న గురించి పరుషంగా మాట్లాడవద్దని జగన్ ఎన్నికలప్పుడూ చెప్పారని వివరించారు. వివేకా హత్య వెనుక పది, పన్నెడు కారణాలు కనిపిస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.