అమరావతి : ఏపీ మంత్రి నారా లోకేష్( Nara Lokesh ) వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ( YS Jagan ) తీరుపై మండి పడ్డారు. నిన్న వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను పరిశీలించి అక్కడి మత్స్యకారులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయదలుచుకున్న ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ( Defence company ) తొలగిస్తామని వ్యాఖ్యనించారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ ఈ వ్యాఖ్యలపై ట్విటర్ వేదిక ద్వారా స్పందించారు. దేశ రక్షణకు అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి, తరిమేస్తానని హెచ్చరించడం శోచనీయమని, జగన్ది రాక్షస మనస్తత్వమని ఆరోపించారు. తల్లిని తరిమేశారు. చెల్లిని గెంటేశారు. దైవం అంటే భక్తి లేదు. దేశం అంటే జగన్ కు ద్వేషమని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారని, ఉద్యోగాలు వస్తాయంటే ఉసూరుమంటూ ఏడుస్తున్నారని ఆరోపించారు.
నిలువెల్లా స్వార్థం, మనసంతా విధ్వంసంతో రప్పా రప్పా నరుకుతాం. అమరావతిని మార్చేస్తాం. కట్టినవన్నీ కూల్చేస్తాం. కంపెనీలన్నీ వెళ్లగొడతామంటూ దుర్మార్గ పనులకు పాల్పడుతున్నాడని విరుచుకు పడ్డారు. మత్స్యకారుల పిల్లలకు మెరుగైన వెయ్యికి పైగా ఉద్యోగాలు వస్తాయంటే, ఆనందించాల్సింది పోయి, అడ్డుకుంటాననడం ముమ్మాటీకీ సైకోయిజమేనని అభివర్ణించారు.