అమరావతి: సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాలపై టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఏపీలో నిన్న విడుదలైన టెన్త్ ఫలితాల్లో 62.76 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. టెన్త్ ఫలితాలపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ‘కలెక్టర్లకు టార్గెట్లు పెట్టి పిల్లలు ఫెయిలయితే చర్యలు తీసుకుంటామని బెదిరించింది ఎవరు? పాస్ పర్సంటేజీ పెంచేందుకు కిందిస్థాయి నుంచి పై వరకు ఏం చేశారో తెలియదా? మీ అండదండలున్న కార్పొరేట్ సంస్థలలో చదివే పిల్లలు ఆలిండియా ర్యాంకర్లాయె. ఇప్పుడా ర్యాంకులు తగ్గయాయని ఏడుపా బాబు’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
విజయసాయిరెడ్డి ట్వీట్కు టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు తీవ్రంగా స్పందించారు. ‘టెన్త్ క్లాసు పేపర్లు కొట్టేసి స్టేషన్లో తన్నులు తిన్నా పాస్ కాని నత్తి పకోడి రెడ్డి రెండు లక్షల మంది విద్యార్థులను ఫెయిల్ చేసి మూడు వేల కోట్ల అమ్మఒడి డబ్బును మిగుల్చుకోవాలని కన్నింగ్ ప్లానింగ్ వేశాడు. పనికిమాలినోడికి పదవి ఇచ్చినందుకు రిజల్ట్ రివర్స్ అయ్యాయి. విద్యావ్యవస్థ నాశనం అయింది’ అని అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేసి విజయసాయిరెడ్డికి సమాధానం ఇచ్చారు.
కాగా, పదో తరగతి విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని దాదాపు 5 వేల పాఠశాలలు మూతపడ్డాయని, అలాగే ఇంగ్లిష్ బోధన వల్ల చిన్నారుల మానసిక వికాసం దెబ్బతింటున్నదని విచారం వ్యక్తం చేశారు.