MLA Pinnelli | వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడాన్ని ఎమ్మెల్యే శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి పిన్నెల్లి ఏమీ బందిపోటు కాదని స్పష్టం చేశారు. ఒక ప్రజానేతకు లుకౌట్ నోటీసులు జారీ చేయడం దారుణమని విమర్శించారు.
మాచర్ల నియోజకవర్గంలో కూటమి నేతలు రిగ్గింగ్ చేస్తున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పిన్నెల్లి.. క్షణికావేశంలో ఈవీఎంలు పగలగొట్టి ఉండవచ్చని ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. దీనిపై పోలీసులు స్పందించే తీరు సరైనది కాదంటూ మండిపడ్డారు. రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన కూటమి సభ్యులు ఒక్కరిపై కూడా ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విధ్వంసకర ఘటనలు చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. దీన్ని సీరియస్గా తీసుకున్న ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే పిన్నెల్లికి కూడా ఇందులో సంబంధం ఉందని ఆయనకు ఈసీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఒక పోలింగ్ బూత్లోకి వెళ్లిన పిన్నెల్లి.. అక్కడి ఈవీఎంను పగలగొట్టినట్లుగా రికార్డ్ అయ్యింది. అయితే పోలింగ్ బూత్లో జరిగిన అల్లర్లకు సంబంధించిన వీడియోను ఈసీ కాకుండా.. టీడీపీ నేత నారా లోకేశ్ విడుదల చేయడంపై వైసీపీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో అసలు నిజమైనదేనా? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. వాస్తవంగా నేరం జరిగితే శిక్ష పడాల్సిందేనని.. అయితే ఫేక్ వీడియోలు సృష్టించి నేరాన్ని మోపడం తప్పని అన్నారు. రాష్ట్రంలో మిగతా చోట్ల ఈవీఎంల ధ్వంసం, పోలింగ్ బూత్ల ఆక్రమణలకు సంబంధించిన వీడిఓలను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.