అమరావతి : అధికార పార్టీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వినూత్న తరహాలో నిరసన తెలిపి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడపగడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన నగరంలోని 21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు కాలనీలో వంతెన, డ్రైనేజీ సమస్యపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
సమస్యను పరిష్కరించకపోవడం వల్ల వందల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. అనేక సంవత్సరాలుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాల ని రైల్వే పరిధిలో ఉందని ఒకరు, తమ పరిధి కాదని మున్సిపల్ అధికారులు పట్టించుకోక పోవడంతో ఆయన వినూత్న తరహాలో మురికి గుంటలో దిగి నిరసన తెలిపారు. సమస్యను పరిష్కరించాలని స్థానికులతో కలిసి మురికి గోడ పైనే కొద్దిసేపు కూర్చున్నారు.
తనకు లిఖితపూర్తక హామీ ఇస్తేనే తాను ఇక్కడి నుంచి కదులుతానని అధికారులకు వివరించారు. చివరకు అధికారుల హామీతో అక్కడి నుంచి బయటకు వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మురికిగుంట పరిస్థితి పదేళ్లుగా తీవ్రంగా ఉందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక మార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఆయా కారణాలతో స్లామ్ డ్రైయిన్ సమస్యను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.