కడప : వైసీపీకి చెందిన ఓ సర్పంచ్ చెత్త సేకరించి నిరసన తెలుపగా.. ఇప్పుడు ఇదే పార్టీకి చెందిన వార్డ్ మెంబర్ ఏకంగా పొర్లు దండాలు పెట్టారు. తమ ఊరికి రోడ్డు వేయాలంటూ వినూత్నంగా నిరసన తెలిపి అందరి దృష్టికి ఆకర్శించారు. ప్రభుత్వం దృష్టిని కూడా ఆకర్శించి గ్రామానికి రోడ్డు రావాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా వైఎస్సార్ కడప జిల్లాలో గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కొరవడి ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మంత్రి , జెడ్పీ చైర్మన్ మొదలుకొని సర్పంచ్ వరకు నిధుల కోసం ప్రభుత్వానికి విన్నవించి అవి అందక నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పరిధిలోని సోమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు పొర్లు దండాలు పెట్టి తమ గ్రామానికి రోడ్డు వేయాలంటూ సీఎం జగన్కు విజ్ఞప్తి చేశారు. ఈయన కూడా అధికార పార్టీకి చెందిన వాడే కావడం విశేషం.
వైసీపీకి చెందిన వార్డు సభ్యులు పొర్లు దండాలు పెడుతున్న వీడియోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్లో పోస్ట్ చేసి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. వచ్చే ఏడాది జనవరి 1 కల్లా రోడ్లపై ఒక్క గుంత కనపడదంటూ మూడేండ్లుగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు ప్రతి ఏలా ఇచ్చే స్టేట్మెంట్లలో ఒక్క అక్షరమూ మారలేదు. రోడ్ల దుస్థితి మారలేదు. ఇలా బురదలో పొర్లుదండాలు పెడుతూ తమ గ్రామానికి రోడ్డు వేయాలని విన్నవిస్తున్నది సీఎం జగన్ రెడ్డి సొంత కడప జిల్లా బీ మఠం మండలం కొత్తబసవాపురం సోమిరెడ్డిపల్లి పంచాయతీ వార్డు సభ్యుడు అని పేర్కొన్నారు. అన్నింటికి బటన్ నొక్కుతున్న సీఎం.. దరిద్రపు రోడ్డు బాగు అయ్యేలా ఒకసారి బటన్ నొక్కితే గ్రామస్థులకి ఈ బురదలో పొర్లుదండాలు పెట్టే బాధ ఉండదు. నిరసన తెలిపే వారిపై తప్పుడు కేసులు బానాయించి అక్రమ అరెస్టులు చేయాల్సిన టాస్క్ సీఐడీకి తప్పుతుందని తీవ్రంగా విమర్శించారు.