Chevireddy Mohith Reddy | చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్యాయత్నం చేశారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని శనివారం రాత్రి అరెస్టు చేశారు. తండ్రి భాస్కర్ రెడ్డి, తమ్ముడు హర్షిత్ రెడ్డితో కలిసి దుబాయికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా బెంగళూరులోని దేవనహళ్లి ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మోహిత్పై ఏపీ సిట్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో.. బోర్డింగ్ పాస్ చెక్ చేసే సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు.
తిరుపతి డీఎస్పీ రవిమనోహరాచారి నేతృత్వంలోని బృందం చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం తిరుపతిలోని ఎస్వీయూ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. కాసేపు విచారించిన అనంతరం 41ఏ కింద నోటీసులు ఇచ్చి వదిలేశారు. విదేశాలకు వెళ్లకుండా ఆయపై ఆంక్షలు విధించారు.
ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. కావాలనే కక్షపూరితంగా తనను కేసులో ఇరికించారని మండిపడ్డారు. విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. తనపై పెట్టిన తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వాళ్ల నాన్నను స్ఫూర్తిగా తీసుకుని పోరాడతానని తెలిపారు. తాము బతికి ఉన్నంతకాలం ప్రజల కోసం పోరాడతానని చెప్పారు.
టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.
కావాలనే కక్షపూరితంగా కేసులో ఇరికించారు.
విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు.
తప్పుడు కేసుపై న్యాయపోరాటం చేస్తాం.
మా నాన్నని స్ఫూర్తిగా తీసుకుని పోరాడతాం.
మేం బతికి ఉన్నంతకాలం ప్రజల కోసం పోరాడతాం. pic.twitter.com/vGv8BXLrD8— Chevireddy Mohith Reddy (@ChevireddyMohit) July 28, 2024
నా కుమారుడిని వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారు
రాజకీయ కక్షలతో తన కుమారుడు మోహిత్ రెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేశారని వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. విదేశాల్లో చదివిన తన కొడుకును వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు పెట్టినప్పటి నుంచి గత వారం రోజులుగా తుమ్మలగుంటలనే ఉన్నా తన కుమారుడి అరెస్టు చేయలేదని అన్నారు. కానీ ఘటన జరిగిన 52 రోజుల తర్వాత స్నేహితుడి వివాహానికి దుబాయి వెళ్తుంటే.. బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.
తాను విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో పెరిగానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుర్తు చేశారు. తన కన్నా మించి మోహిత్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలు ఎలా ఉంటాయో ఈ ప్రభుత్వానికి, పోలీసు అధికారులకు రుచి చూపిస్తాడని తెలిపారు. ప్రజల పక్షాన ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.