ఏలూరు : కొత్త జిల్లాలు 26 ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు జిల్లాల ఏర్పాటుపై హర్షం వ్యక్తం అవుతుండగా.. మరికొన్నిజిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు వస్తున్నాయి. మరికొన్ని చోట్ల పేర్లు మార్చాలంటూ.. ఇంకొన్ని చోట్ల ప్రాంతాలు మార్చాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భీమవరం జిల్లా ఏర్పాటు కోసం అవసరమైన భూమిని విరాళంగా ఇచ్చేందుకు ఓ వైసీపీ నేత ముందుకొచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వేరుపడి భీమవరం కొత్త గా జిల్లా ఏర్పాటు కానున్నది. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ముఖ్యమైన ప్రాంతంగా ఉన్నది. అయితే, వీలైనంత తొందరగా జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు తన రూ.15 కోట్ల విలువ చేసే 10 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేందుకు వైసీపీ నేత గాదిరాజు సుబ్బరాజు ముందుకొచ్చారు.
భీమవరం పట్టణం సమీపంలోని కాళ్ల వద్ద తనకు 10 ఎకరాల భూమి ఉన్నదని, దాని విలువ ప్రస్తుతం రూ. 15 కోట్ల వరకు ఉంటుందని సుబ్బరాజు తెలిపారు. భీమవరం జల్లా కేంద్రంగా ఏర్పడుతున్నందున తన స్థలాన్ని విరాళంగా ప్రభుత్వానికి ఇస్తానని ప్రకటించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లానని, ఎప్పుడు ప్రభుత్వం కావాలంటే అప్పుడే తన స్థలాన్ని ఇచ్చేందుకు తాను సిద్ధమని ఆయన చెప్పారు.