శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలోని వాసవీసత్రానికి అరుదైన గౌరవం దక్కింది. సుమారు 60 సంవత్సరాల కిందట భక్తులకు వసతి అన్నదానం సౌకర్యం కల్పించాలనే సదుద్దేశంతో మూర్తి వెంకటేశ్వర్లు స్థాపించిన సత్రానికి దేశంలోనే నాణ్యమైన భోజనం, ఏళ్ల తరబడిగా భక్తులకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నందుకు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్’ కమిట్మెంట్ సర్టిఫికెట్ అందించింది. ఈ సర్టిఫికెట్ను మంగళవారం శ్రీశైల క్షేత్రంలో భారత్ సౌత్ రీజియన్ జాయింట్ సెక్రెటరీ ఉల్లాజి ఇలియాజర్, సభ్యులు అందజేశారు.
ఈ సందర్భంగా సత్రాన్ని సందర్శించి, మీడియాతో మాట్లాడారు. దేశంలోనే ఇలాంటి సర్టిఫికెట్ పొందిన మొట్టమొదటి సత్రంగా వాసవీసత్రం నిలిచిందన్నారు. సత్రానికి అరుదైన గుర్తింపు రావడంపై సత్రం ప్రస్తుత అధ్యక్షుడు దేవకీ వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్రం కమిటీ సభ్యులు, సిబ్బంది దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు, మరిన్ని పుణ్యక్షేత్రాల్లో వాసవీసత్రం సముదాయాలను నెలకొల్పి భక్తులకు సేవలందిస్తామన్నారు.