అమరావతి : వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు (Dadi Veerabadra rao) సొంతగూటి అయిన టీడీపీ (TDP) లో చేరనున్నారు. మంగళవారం వైసీపీ (YCP) కి రాజీనామా(Resign) చేసిన కొద్ది గంటల్లోనే తన మాతృసంస్థ అయిన టీడీపీలో చేరేందుకు అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అపాయిమెంట్ కోరారు. అక్కడి నుంచి సానుకూల స్పందన రావడంతో బుధవారం దాడి వీరభద్రరావుతో పాటు అతడి కుమారుడు రత్నాకర్, జైవీర్ టీడీపీ అధినేతతో చర్చించనున్నారు.
దాడి రత్నాకర్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ కుటుంబం టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నామని వెల్లడించారు. దాడి వీరభద్రరావు 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి ( Anakapalli) నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 1994లో సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి 2013లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.
2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో స్థబ్దుగా ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత తిరిగి వైసీపీలో చేరారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న ఉద్దేశంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీలను మారుస్తుండడం వల్ల పార్టీలో రాజకీయ గందరగోళం నెలకొని ఉంది. దీంతో కొంత మంది రాజీనామాలు చేస్తుండగా మరికొంత మంది అవకాశం రావడం లేదన్న బాధ, భయంతో ఇతర పార్టీలవైపు దృష్టిని సారిస్తున్నారు.