కడప: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీనియారిటీతో దేశానికి గానీ, రాష్ట్రానికి గానీ ఎలాంటి ఉపయోగం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. క్యాసినో పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండుగ ముగిసిపోయి ఇన్ని రోజులైనా టీడీపీ అధినేత గత పది రోజులుగా జూదం, క్యాసినోల గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏనాడూ జూదాలను ప్రోత్సహించలేదని, ప్రభుత్వంపై బురద జల్లేందుకే ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో నైట్ లైఫ్ కల్చర్ తీసుకొచ్చింది తానేనని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను శ్రీకాంత్రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల యూనియన్లను చంద్రబాబు హెచ్చరించారని, ఇప్పుడు మాత్రం ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్నారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నదని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని శ్రీకాంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు అడగకపోయినా ముఖ్యమంత్రి కాగానే జగన్ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చారన్నారు. ప్రభుత్వంపై భారం పడుతున్నా ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని గడికోట శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు.